Share News

పొర్లుదండాలు.. సాష్టాంగ నమస్కారాలు

ABN , Publish Date - Jan 18 , 2024 | 12:05 AM

అంగన్వాడీల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అంగన్వాడీలు శ్రీకాకుళంలోని జ్యోతిబాపూలే పార్కు వద్ద పొర్లుదండాలు చేస్తూ.. సాష్టాంగ నమస్కారం చేస్తూ కనికరించండి మహాప్రభో అంటూ బుధవారం వినూత్నంగా నిరసన తెలిపారు.

పొర్లుదండాలు.. సాష్టాంగ నమస్కారాలు
శ్రీకాకుళంలో అంగన్‌వాడీ సిబ్బంది నిరసన

అరసవల్లి, జనవరి 17: అంగన్వాడీల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అంగన్వాడీలు శ్రీకాకుళంలోని జ్యోతిబాపూలే పార్కు వద్ద పొర్లుదండాలు చేస్తూ.. సాష్టాంగ నమస్కారం చేస్తూ కనికరించండి మహాప్రభో అంటూ బుధవారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి పి.తేజేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బి.కృష్ణమూర్తి మాట్లాడుతూ పెంచిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోతే అంగన్వాడీలు ఎలా జీవనం సాగించాలని ప్రశ్నించారు. గత 37 రోజులుగా అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించు కోకుండా వ్యవహరించడం సమర్థనీయం కాదన్నారు. తెలంగాణ కన్నా వెయ్యి రూపాయల ఎక్కువ వేతనం చెల్లిస్తామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆర్‌.ప్రకాష్‌, సీహెచ్‌ అరుణ, వై.లీలారత్నకుమారి, డి.ముత్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఇచ్ఛాపురంలో..
ఇచ్ఛాపురం, జనవరి 17:
ఇచ్ఛాపురంలో బుధవారం 36వ రోజు అంగన్వాడీ ఉద్యోగులు ఆందోళన కొనసాగించారు. బస్టాండ్‌ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన శిబిరం వద్ద ఎండలోనే నిరసన తెలిపారు. ‘మా సమస్యలు పరిష్కరించు జగన్‌’ అంటూ నినాదాలు చేశారు. ముక్కనుమ పండుగ నాడు ఇంటికి కూతుర్లు, అల్లుళ్లు వచ్చినా వారిని వదిలి దీక్షల్లో పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 12:05 AM