గదులు చాలక.. బోధన సాగక
ABN , Publish Date - Aug 24 , 2024 | 11:46 PM
ww
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సమస్యలు తిష్ఠ వేశాయి. ప్రధానంగా గదులు చాలకపోవడంతో బోధన సక్రమంగా సాగడం లేదు. బంగ్లారోడ్లో కొత్తగా కళాశాల భవనాన్ని నిర్మించారు. అక్కడ సరిపడ గదులు నిర్మించకపోవడంతో బాలికలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ప్రధానంగా ఒక గదిలో తరగతుల నిర్వహణతో పాటు సైన్స్ కోర్సుకు సంబందించి ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. అదే గదిలో ప్రాక్టికల్ సామగ్రి ఉండడంతో తరగతుల నిర్వహణకు ఆటంకం కలుగుతోంది. గదుల కొరత వల్ల సైన్స్ ల్యాబ్లో ప్రాక్టికల్స్ నిర్వహించే సమయంలో బోధన నిలిపివేయాల్సి వస్తోంది. ఇక్కడ 430 మంది బాలికలు చదువుతున్నారు. ఇందులో సైన్స్కు సంబంధించి ప్రథమ సంవత్సరం 130 మంది, రెండో సంవత్సరం 140 మంది బాలికలు ఉన్నారు. మొత్తం 270 మందికి ఒకే గదిలో ప్రాక్టికల్స్ నిర్వహించడంతో సక్రమంగా ప్రాక్టికల్స్ జరగడం లేదని ద్వితీయ సంవత్సరం ఇంటర్ విద్యార్థినులు వాపోతున్నారు. ఇచ్ఛాపురం పట్టణం, గ్రామీణ ప్రాంత, ఒడిశాలోని తెలుగు విద్యార్థినులు ఇక్కడే ఇంటర్ చదువుతున్నారు. ఇక్కడ చేరే విద్యార్థినుల సంఖ్య పెరుగుతున్నా, వసతులు పెరగడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.
నాలుగు గ్రూపులు.. ఆరు గదులు
ప్రస్తుతం ఇక్కడ ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ గ్రూపులు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం బోధనకు ఎనిమిది వరకూ గదులు అవసరం. ప్రాక్టికల్స్కు మరో నాలుగు గదులు ఉండాలి. అయితే ప్రస్తుతం ఆరు గదులు మాత్రమే ఉన్నాయి. ఇందులోనే కార్యాలయంతోపాటు ప్రిన్సిపాల్ విధులు నిర్వహించాల్సివస్తోంది. మరో ఏడు వరకు మొత్తం గదులు అవసరమని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రస్తుతం నిర్వహణ కళాశాలను ఇటీవలే నిర్మించారు. ఆ సమయంలో గ్రాంట్ పూర్తిస్థాయిలో విడుదలకాకపోవడంతో ఆరు గదులు మాత్రమే నిర్మించారు. ఇక్కడ వసతి సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు తీసుకోవడంలేదని విద్యార్థినుల తల్లిదండ్రులు వాపోతున్నారు. తక్షణమే ఇంటర్ బోర్డు అధికారులు అదనపు గదులు నిర్మించి బోధన, ప్రాక్టికల్స్కు అవస్థలు తీర్చాలని పలువురు కోరుతున్నారు.