Share News

ఎన్డీఏ కూటమిదే విజయం

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:49 PM

‘వైసీపీ రాక్షస ప్రభుత్వాన్ని వదిలించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమ’ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

ఎన్డీఏ కూటమిదే విజయం
కలమటను సత్కరిస్తున్న అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు తదితరులు

- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

- జిల్లా అధ్యక్షుడిగా కలమట బాధ్యతల స్వీకరణ

అరసవల్లి, ఏప్రిల్‌ 26: ‘వైసీపీ రాక్షస ప్రభుత్వాన్ని వదిలించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమ’ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళం 80 అడుగుల రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో.. పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడిగా కలమట వెంకటరమణ బాధ్యతలు చేపట్టారు. ఆయనను అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌ ఘనంగా సన్మానించారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘సీఎం జగన్‌ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారు. గంజాయి ఆంధ్రాగా మార్చేశారు. ఇటీవల జగన్‌ చేపట్టిన బస్సుయాత్ర.. తుస్సుయాత్రగా మారింది. కోడికత్తి, గులకరాయి డ్రామాలను ప్రజలు నమ్మడం లేదు. వైసీపీ సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని తెలిపారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. ‘జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం తథ్యం. పార్టీ కోసం కలమట వెంకటరమణ చేసిన త్యాగం చారిత్రాత్మకమైనది. కలమట అవసరాన్ని గుర్తించే చంద్రబాబు ఆయనను జిల్లా అధ్యక్షుడిగా నియమించార’ని తెలిపారు. కలమట వెంకటరమణ మాట్లాడుతూ.. ‘అందరి సహకారంతో టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి విజయం సాధించడం ఖాయం. టికెట్‌ కేటాయించక పోవడంతో మనస్థాపానికి గురైన మాట వాస్తవమే. కానీ చంద్రబాబు నా సేవలను గుర్తించి పార్టీలో సముచిత స్థానం కల్పించి గౌరవించార’ని హర్షం వ్యక్తం చేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని అందరి సహకారంతో ముందుకు సాగుతానని తెలిపారు. కార్యకమ్రంలో నరసన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, బోయిన గోవిందరాజులు, పడాల భూదేవి, చౌదరి బాబ్జీ, కలమట సాగర్‌, సింతు సుధాకర్‌, విభూది సూరిబాబు, గుత్తు చిన్నారావు, మెండ దాసునాయుడు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:49 PM