Share News

మంత్రివర్యా.. ఇసుక దందా కనిపించట్లేదా?

ABN , Publish Date - Jan 09 , 2024 | 11:36 PM

‘ఎంతో నీతివంతమైన పాలన అందిస్తున్నట్లు మంత్రి ధర్మాన ప్రసాదరావు గొప్పలు చెబుతుంటారని, కానీ ఆయన ఇలాకాలోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని, ఈ దందా మంత్రికి కనిపించట్లేదా’ అని టీడీపీ నాయకులు ప్రశ్నించారు.

    మంత్రివర్యా.. ఇసుక దందా కనిపించట్లేదా?
వంశధార తీరంలో నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు గొండు శంకర్‌ తదితరులు

- వంశధారలో టీడీపీ శ్రేణుల నిరసన

గార, జనవరి 9: ‘ఎంతో నీతివంతమైన పాలన అందిస్తున్నట్లు మంత్రి ధర్మాన ప్రసాదరావు గొప్పలు చెబుతుంటారని, కానీ ఆయన ఇలాకాలోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని, ఈ దందా మంత్రికి కనిపించట్లేదా’ అని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. మండలంలోని బూర వెల్లి, అంబళ్లవలస దగ్గర వంశధార నదిలో చేపడుతున్న ఇసుక తవ్వకాల వద్ద మంగళవారం టీడీపీ యువ నాయకుడు గొండు శంకర్‌ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి ఇలాకాలోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా జిల్లా అధికార యంత్రాంగం చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. ఇసుక తవ్వకాలతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడి పశువులు, స్థానికులు ఇబ్బంది పడుతున్నా అధికారులు స్పందించక పోవడం దారుణమన్నారు. నదీ గర్భంలో భూగర్గ జలాలు అడుగంటిపోయి ప్రజలకు తాగునీటి సమస్య ఏర్పడుతుందన్నారు. తాడేపల్లి పేలస్‌ కనుసన్నల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తీరం కోతకు గురై వరదల సమయంలో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఇసుక అక్రమ రవాణాను నిలుపుదల చేయకపోతే తామే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుండ భాస్కరరావు, బీజీవీ ఆర్‌ మూర్తి, బడగల వెంకట అప్పారావు, కె.ఆదినారాయణ, మైగాపు ప్రభాకరరావు, శిమ్మ శ్రీనివాస్‌, మళ్ల త్రినాథరావు, మళ్ల రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 11:36 PM