టీడీపీలోకి భారీగా వలసలు
ABN , Publish Date - Jan 09 , 2024 | 11:32 PM
పాతపట్నం నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు ప్రారంభమయ్యాయి.
![టీడీపీలోకి భారీగా వలసలు](https://media.andhrajyothy.com/media/2023/20231205/9hlm2_1f91a3a690.gif)
- మూడు మండలాల నుంచి 215 కుటుంబాలు చేరిక
- ఆహ్వానించిన ఎంపీ రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే కలమట
హిరమండలం/ఎల్ఎన్పేట/కొత్తూరు: పాతపట్నం నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఒక్కరోజు మూడు మండలాలల నుంచి 215 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. హిరమండలం మండలంలోని భగీరథపురం, నీలాదేవిపురం గ్రామాలకు చెందిన 80 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వీరిలో భగీరథపురం ఉప సర్పంచ్ ఎన్.రామరాజుతో పాటు నలుగురు వార్డు సభ్యులు ఉన్నారు. అలాగే, ఎల్.ఎన్.పేట మండలంలోని పెద్దకొల్లివలస ఆర్అండ్ఆర్ కాలనీ, స్కాట్పేటకు చెందిన 70 కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరాయి. అదే విధంగా కొత్తూరు మండలంలోని దాశరథిపురం గ్రామానికి చెందిన 65 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వీరందరికీ ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. భగీరథపురం పంచాయతీ అభివృద్ధికి ఎంపీ నిధులు మంజూరు చేస్తే స్థానిక వైసీపీ సర్పంచ్ పంచాయతీ తీర్మానం ఇవ్వకుండా అభివృద్ధి పనులను అడ్డుకోవడం ప్రజల గమనించాలని ఎంపీ రామ్మోహన్ అన్నారు. రాజశేఖర్రెడ్డిపై ఉన్న అభిమానంతో అతని కుమారుడు జగన్కు ప్రజలు ఓట్లువేసి గెలిపించారే తప్ప ఆయనపై ఉన్న నమ్మకంతో కాదని ఎంపీ విమర్శించారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో జగన్ విఫలమయ్యారని తెలిపారు. రానున్న రోజుల్లో టీడీపీకి మరింత బలం చేకూరుతుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని తెలిపారు.