Jagatimetta Housing Colony జగతిమెట్ట ఇళ్ల కాలనీలో అక్రమాలు వాస్తవమే
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:11 AM
Housing Colony Illegal Activities జగతిమెట్ట సమీపంలో ఇళ్ల కాలనీపై వచ్చిన ఫిర్యాదుల మేరకు స్థానికేతర రెవెన్యూ సిబ్బందితో పది రోజులపాటు ప్రాథమిక దర్యాప్తు నిర్వహించామని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తెలిపారు.

అనర్హులపై చర్యలు తీసుకుంటాం
ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి
టెక్కలి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): జగతిమెట్ట సమీపంలో ఇళ్ల కాలనీపై వచ్చిన ఫిర్యాదుల మేరకు స్థానికేతర రెవెన్యూ సిబ్బందితో పది రోజులపాటు ప్రాథమిక దర్యాప్తు నిర్వహించామని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి తెలిపారు. గురువారం స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయంలో తహసీల్దార్ దిలీప్చక్రవర్తితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ‘జగతిమెట్ట ప్రాంతంలో 331 ఇళ్లకు రెవెన్యూ అధికారులు గతంలో పట్టాలు మంజూరు చేస్తే, అక్కడ ప్రస్తుతం 412 ఇళ్ల స్థలాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ సుమారు 30మంది ఇళ్ల నిర్మాణాలు చేపట్టకపోవడంతో వారి పట్టాలు రద్దయ్యాయి. మిగిలిన ఇళ్లకు సంబంధించి దర్యాప్తు చేయగా.. 57 మంది వరకూ పట్టాలు చూపించి.. స్థానికంగా ఉన్నారు. మిగిలిన వారెవ్వరూ రెవెన్యూ సిబ్బందికి పట్టాలు చూపించలేదు. ఆ ప్రాంతంలో 280 చోట్ల కొందరు పునాదులు, లింటల్స్, శ్లాబ్లెవెల్స్ నిర్మాణాలు చేపట్టారు. కొంతమంది ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అనర్హులు, పట్టాలు మార్పిడి చేసినవారు, నకిలీ పట్టాలు సృష్టించిన వారిని గుర్తించి.. చట్టపరంగా చర్యలు తీసుకుంటామ’ని ఆర్డీవో తెలిపారు. వారం రోజుల్లో లబ్ధిదారులు తమ పట్టాలను తహసీల్దార్ సమక్షంలో ధ్రువీకరించుకోవాలని సూచించారు. మరోసారి రెవెన్యూ అధికారులు పరిశీలించి.. అనర్హులను తొలగిస్తారని స్పష్టం చేశారు.