ఎండలు.. బాబోయ్ ఎండలు
ABN , Publish Date - Apr 19 , 2024 | 12:02 AM
ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు ఎండ తీవ్రత, మరోవైపు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఎల్.ఎన్.పేటలో రికార్డుస్థాయిలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత
14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
అరసవల్లి/ ఎల్.ఎన్.పేట, ఏప్రిల్ 18: ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు ఎండ తీవ్రత, మరోవైపు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గురువారం ఎల్.ఎన్.పేట మండలంలో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపడంతో అలికాం-బత్తిలి రహదారి నిర్మానుష్యంగా కనిపించింది. హిరమండలంలో 42.7 డిగ్రీలు, ఆమదాలవలసలో 42.1, బూర్జలో 41.8 డిగ్రీలు.. ఇలా జిల్లాలోని అన్నిమండలాల్లో 40డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. దీంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు హడలిపోతున్నారు. అత్యవసరమైతేనే జాగ్రత్తలు తీసుకుంటూ బయటకు వస్తున్నారు. ఈక్రమంలో మధ్యాహ్నం వేళ రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో ఎండలు ఇంకెంత తీవ్రంగా ఉంటాయో అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.