నిధులు.. ఎగ్గొట్టారు!
ABN , Publish Date - Jul 11 , 2024 | 11:41 PM
హిరమండలం వద్ద వంశధార నదిపై ఉన్న గొట్టాబ్యారేజీ శిథిలావస్థకు చేరుకుంది. జిల్లా రైతులకు సాగునీటితో పాటు ఎన్నో గ్రామాలకు తాగునీటి అవసరాలు తీర్చే ఈ బ్యారేజీ.. వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
- శిథిలావస్థలో గొట్టాబ్యారేజీ
- మరమ్మతులకు పైసా ఇవ్వని వైసీపీ ప్రభుత్వం
- ఏళ్ల తరబడి కానరాని నియామకాలు
- సాగునీటికి తప్పని ఇబ్బందులు
- కూటమి సర్కార్పైనే రైతుల ఆశలు
(హిరమండలం)
హిరమండలం వద్ద వంశధార నదిపై ఉన్న గొట్టాబ్యారేజీ శిథిలావస్థకు చేరుకుంది. జిల్లా రైతులకు సాగునీటితో పాటు ఎన్నో గ్రామాలకు తాగునీటి అవసరాలు తీర్చే ఈ బ్యారేజీ.. వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. దీనికి అనుసంధానంగా సుమారు రూ.1,750కోట్లతో వంశధార రిజర్వాయర్ నిర్మిస్తున్నా.. గత ప్రభుత్వం గొట్టాబ్యారేజీ బాగోగులు పట్టించుకోలేదు. ఐదేళ్లుగా నిధులు మంజూరు చేయలేదు. కనీసస్థాయిలో మరమ్మతులు చేపట్టకపోవడంతో అధ్వానంగా మారింది. ఏటా వరదల కారణంగా.. బ్యారేజీ దిగువన జడ్జిస్టోన్ ఏప్రాన్ పూర్తిగా దెబ్బతింది. రాళ్లు తేలి బ్యారేజీ ప్రమాదపుటంచున నిలిచింది. ఇంజినీరింగ్ నిపుణుల సూచన మేరకు జడ్జిస్టోన్ ఏప్రాన్ స్థానంలో కాంక్రీట్ ఏప్రాన్ నిర్మించేందుకు 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.8.5కోట్లు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్ 10శాతం పనులు చేపట్టారు. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు రాగా.. పనులు నిలిచిపోయాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ.. అంతకుముందు ప్రభుత్వం(టీడీపీ) చేపట్టిన పనుల్లో 25 శాతం లోపల ఉన్నవాటిని రద్దు చేసింది. దీంతో అప్పటి నుంచీ గొట్టాబ్యారేజీ పరిస్థితి దయనీయంగా మారింది. దిగువన ఉన్న సీసీ ఏప్రాన్ను కూడా తక్షణమే నిర్మించకపోతే.. వరదల సమయంలో బ్యారేజీకి ముప్పు తప్పదని ఇంజినీరింగ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
- పట్టని గేట్లు మరమ్మతులు
గొట్టాబ్యారేజీ 24 గేట్లతోపాటు.. అనుసంధానంగా ఉన్న కుడి, ఎడమ కాలువల హెడ్ రెగ్యులేటర్ గేట్లకు ఐదేళ్లుగా కనీస మరమ్మతులు లేక పాడైపోయాయి. బ్యారేజీ ఎగువ ప్రాంతంలో నీరు నిల్వ చేసేందుకు గేట్లు దించినా.. లీకేజీ ద్వారా వథాగా పోతోంది. 2018లో గేట్లకు మరమ్మతులు చేపట్టారు. అప్పటి నుంచీ బ్యారేజీ నిర్వహణకు పూర్తిస్థాయిలో నిఽధులు కేటాయించలేదు. గేట్లకు సంబంధించి బేరింగ్లు, రోలర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటిని మార్చాల్సి ఉన్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. బ్యారేజీ మరమ్మతులకు వంశధార అధికారులు అప్పట్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు చేయలేదు.
- పేరుకుపోయిన పూడికలు
గొట్టాబ్యారేజీ వద్ద పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 6 టీఎంసీలు. గత ఆరేళ్లుగా వచ్చిన వరదలకు ఎగువ ప్రాంతంలో మట్టి నిల్వలు, పూడికలు పేరుకుపోయాయి. దీంతో బ్యారేజీ వద్ద నీటి నిల్వ సామర్ధ్యం తగ్గుతూ వస్తోంది. ఇన్ఫ్లో తక్కువగా ఉన్నప్పుడు కుడి, ఎడమ ప్రధాన కాలువలకు నీటిని విడిచిపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018లో బ్యారేజీ ఎగువ ప్రాంతంలో యంత్రాలతో పూడికలు తొలగించారు. వైసీపీ హయాంలో మట్టి దిబ్బలు తొలగించకపోవడంతో నీటి నిల్వ సామర్ధ్యం తగ్గింది.
- కొట్టుకుపోయిన ఫ్లడ్ బ్యాంక్
గొట్టాబ్యారేజీ కుడివైపు ఉన్న ఫ్లడ్ బ్యాంక్ మూడేళ్ల కిందట వచ్చిన వరదలకు కోతకు గురైంది. ప్రాఽథమిక దశలో మరమ్మతులు చేయకపోవడంతో అప్పటి నుంచి ఏటా వచ్చిన వరదలకు పూర్తిగా కొట్టుకుపోయింది. కనీసం దీని పునర్నిర్మాణానికి కూడా వైసీపీ ప్రభుత్వం పైసా నిధులు మంజూరు చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్డీయే కూటమి ప్రభుత్వంపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. కాగా.. ఈ ఏడాది ఇప్పటికే వర్షాకాలం ప్రారంభం కావడంతో పనులు చేసే పరిస్థితి లేదు. బ్యారేజీ మరమ్మతులు చేపట్టాలంటే వచ్చే ఏడాది జనవరి వరకు ఆగాల్సి ఉంది. కాగా.. ఈ ఏడాది భారీ వరదలు వస్తే.. బ్యారేజీ దిగువ ప్రాంతంలో మరికొంత శిథిలమయ్యే అవకాశం ఉంది.
- వేధిస్తున్న సిబ్బంది కొరత
గొట్టాబ్యారేజీ నిర్వహణకు ఉద్యోగులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ఖరీఫ్ సీజన్లోను, వరదల సమయంలో బ్యారేజీ నిర్వహణకు గతంలో 22మంది ఉద్యోగులు విధులు నిర్వహించేవారు. వర్క్ ఇన్స్పెక్టర్, హెల్పర్, మేన్మజుదూర్, ఆపరేటర్, ఎలక్ర్టిషియన్, లష్కర్లు ఇలా పలువురు సిబ్బంది ఉండేవారు. దశాబ్దాల కిందట నియమించినవారిలో చాలామంది పదవీ విరమణ పొందారు. వారి స్థానంలో కొత్తగా నియామకాలు చేపట్టలేదు. ప్రస్తుతం ముగ్గురు మాత్రమే ఉన్నారు. వీరితోనే బ్యారేజీ, కుడి, ఎడమ ప్రధాన కాలువల నిర్వహణ కష్టమవుతోంది. విద్యుత్ సరఫరా వ్యవస్థ, సీడబ్ల్యూసీ నుంచి వివరాలు సేకరణ ఇలా ఏ పని చేయాలన్నా ఈ ముగ్గురిపైనే ఆధారపడాల్సి వస్తోంది. షిఫ్ట్ పద్ధతి ఉన్నా.. తగినంత సిబ్బంది లేక వీరే వరదల సమయంలో రాత్రీపగలూ విధులు నిర్వర్తిస్తున్నారు. కాలువలకు గండ్లు పడినా వారే స్వయంగా పూడ్చాల్సిన పరిస్థితి నెలకొంది.
- కొత్తగా డిజైన్ రూపొందిస్తున్నాం
గొట్టాబ్యారేజీ మరమ్మతులకు సీఈసీడీఓ సూచనల మేరకు కొత్తగా డిజైన్ రూపొందిస్తున్నాం. ఆ డిజైన్ను ప్రభుత్వానికి పంపిస్తాం. జడ్జిస్టోన్ ఏప్రాన్, చెదిరిన సీసీ బ్లాకు నిర్మాణం వంటి మరమ్మతులకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. వచ్చే ఏడాది ఎస్ఎస్ఆర్ రేట్లు కూడా మారుతాయి. అప్పటి రేట్ల ప్రకారం నివేదిక తయారు చేస్తాం.
- బి.రాంబాబు, ఎస్ఈ, వంశధార ప్రాజెక్టు