Share News

వెళ్లిన నాలుగు నెలలకే..

ABN , Publish Date - Jun 05 , 2024 | 11:46 PM

ఉపాధి కోసం జిల్లాకు చెందిన ఓ యువకుడు నాలుగు నెలల కిందట సౌదిఅరేబియా వెళ్లాడు. అక్కడ అనారోగ్యానికి గురై బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.

వెళ్లిన నాలుగు నెలలకే..
శంకర్‌ (పైల్‌)

-సౌదిఅరేబియాలో జిల్లా యువకుడి మృతి

- చినవంకలో విషాదచాయలు

వజ్రపుకొత్తూరు, జూన్‌ 5: ఉపాధి కోసం జిల్లాకు చెందిన ఓ యువకుడు నాలుగు నెలల కిందట సౌదిఅరేబియా వెళ్లాడు. అక్కడ అనారోగ్యానికి గురై బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. వజ్రపుకొత్తూరు మండలం చినవంక గ్రామానికి చెందిన మదనాల సూర్యనారాయణ, కాంతమ్మ దంపతులకు కుమార్తె భారతి, కుమారుడు శంకర్‌ అలియాస్‌ సతీష్‌ (32) ఉన్నారు. శంకర్‌ పదో తరగతి వరకు చదివాడు. మూడేళ్ల కిందట ఉపాధి కోసం ఖతర్‌ దేశం వెళ్లాడు. అయితే, తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో స్వగ్రామానికి వచ్చేశాడు. అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. తల్లి వైద్యం కోసం అప్పులు చేయాల్సి వచ్చింది. అయినా తల్లి కాంతమ్మ ఏడాది కిందట మృతి చెందింది. దీంతో అప్పుల భారం పెరగడంతో నాలుగు నెలల కిందట ఉపాధి కోసం సౌదిఅరేబియా వెళ్లాడు. డబ్బులు సంపాదించి అప్పులు తీర్చేసి ఆ తరువాత పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున సౌదిఅరేబియాలో బ్రెయిన్‌ స్ర్టోక్‌తో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారు బోరున విలపించారు. వెళ్లిన నాలుగు నెలలకే శంకర్‌ మృతి చెందడంతో చినవంక గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చేందకు అధికారులు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులతో పాటు, గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Jun 05 , 2024 | 11:46 PM