తొలిరోజు.. ఆరు నామినేషన్లు
ABN , Publish Date - Apr 19 , 2024 | 12:04 AM
సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ఆరంభమైంది. గురువారం నుంచి నామినేషన్లను స్వీకరణ ప్రారంభమైంది. తొలిరోజున ప్రధాన రాజకీయపార్టీల నామినేషన్లను దాఖలు కాలేదు. కేవలం ఇండిపెండెంట్ అభ్యర్థులు మాత్రమే నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు నామినేషన్లు వేశారు.
- ఎచ్చెర్ల, ఆమదాలవలసలో చెరో రెండేసి
- టెక్కలి, ఇచ్ఛాపురంలో ఒక్కోటి దాఖలు
- మొత్తం ఇండిపెండెంట్ అభ్యర్థులుగానే..
(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)
సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ఆరంభమైంది. గురువారం నుంచి నామినేషన్లను స్వీకరణ ప్రారంభమైంది. తొలిరోజున ప్రధాన రాజకీయపార్టీల నామినేషన్లను దాఖలు కాలేదు. కేవలం ఇండిపెండెంట్ అభ్యర్థులు మాత్రమే నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు నామినేషన్లు వేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో అప్పుడే నామినేషన్ ఘట్టంలో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు(ఎన్ఈఆర్)... బీజేపీ తరపున ఎన్నికల బరిలో నిల్చున్నారు. అయితే ఈ నియోజకవర్గం నుంచి గురువారం ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. ఒకరు రణస్థలం మండలం పాతర్లపల్లి గ్రామానికి చెందిన నేతల ఈశ్వరరావు. మరొకరు లావేరు మండలం ఎస్.ఎన్.పురం గ్రామానికి చెందిన నడుపూరు ఈశ్వరరావు. వీరిద్దరి పేర్లు కూడా.. ఇంచుమించు కూటమి అభ్యర్థి పేరు మాదిరే ఉండడం గమనార్హం. అసలు అభ్యర్థి ఎవరన్నదీ ఓటర్లలో సందేహం కలిగించేలా వీరిద్దరి నామినేషన్ల దాఖలవ్వడం విశేషం. అలాగే ఆమదాలవలస నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులు, టెక్కలి, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్థి చొప్పున ఇండిపెండెంట్గా నామినేషన్లు వేశారు. శుక్రవారం ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు.