స్ట్రాంగ్రూముల్లో ఈవీఎంలు భద్రం
ABN , Publish Date - May 14 , 2024 | 11:52 PM
పోలింగ్ ముగియడంతో జిల్లాలోని 8 నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లన్నీ.. చిలకపాలెంలోని శివానీ ఇంజనీరింగ్ కళాశాలలో స్ర్టాంగ్రూముల్లో భద్రపరిచారు.
కలెక్టరేట్/గుజరాతీపేట, మే 14: పోలింగ్ ముగియడంతో జిల్లాలోని 8 నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లన్నీ.. చిలకపాలెంలోని శివానీ ఇంజనీరింగ్ కళాశాలలో స్ర్టాంగ్రూముల్లో భద్రపరిచారు. మంగళవారం ఉదయం జిల్లా ఎన్నికల పరిశీలకుడు శేఖర్ విద్యార్థి, కలెక్టర్ మన్జీర్ జిలానీ సమూన్, ఆయా నియోజకవర్గాల ఆర్వోలు, అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వాటికి సీళ్లు వేశారు. మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్రూమ్ల వద్ద ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) కేంద్ర భద్రతా దళాలు పహారా కాస్తున్నాయి. వెలుపల వైపు రాష్ట్ర రిజర్వు పోలీసు దళాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి. కళాశాల చుట్టూ మరో బృందం షిఫ్ట్ల వారీ విధులు నిర్వర్తిస్తాయి. అలాగే 24 గంటలు సీసీ కెమెరాల నిఘాతో పాటు రికార్డింగ్ కూడా చేస్తాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. లెక్కింపు పూర్తయ్యేవరకు ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతపై ఏవైనా సందేహాలుంటే తమను సంప్రదించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మన్జీర్ జిలానీ సమూన్ తెలిపారు. అలాగే స్ర్టాంగ్రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లను ఎస్పీ జీఆర్ రాధిక మంగళవారం పరిశీలించారు. భద్రతా అంశాలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మరో ఎన్నికల పరిశీలకుడు సందీప్కుమార్, జేసీ ఎం.నవీన్, టెక్కలి ఆర్వో నూరుల్కమర్, శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ తమీమ్ అన్సారియా, డీఆర్వో ఎం.గణపతిరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.