పకడ్బందీగా ఎన్నికల నియమావళి
ABN , Publish Date - Feb 25 , 2024 | 12:26 AM
రానున్న సార్వత్రిక పోరు నేపథ్యంలో పకడ్బందీగా ఎన్నికల నియమావళి అమలు చేయాలని జడ్పీ సీఈవో డి.వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం జడ్పీ సమావేశ మందిరంలో ఎంసీసీ నోడల్ అధికారులు, జిల్లాస్థాయి మాస్టర్ ట్రైనీలు, ఎంపీడీవోలు, స్టేషన్ హౌస్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు.
![పకడ్బందీగా ఎన్నికల నియమావళి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
- జడ్పీ సీఈవో వేంకటేశ్వరరావు
అరసవల్లి, ఫిబ్రవరి 24: రానున్న సార్వత్రిక పోరు నేపథ్యంలో పకడ్బందీగా ఎన్నికల నియమావళి అమలు చేయాలని జడ్పీ సీఈవో డి.వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం జడ్పీ సమావేశ మందిరంలో ఎంసీసీ నోడల్ అధికారులు, జిల్లాస్థాయి మాస్టర్ ట్రైనీలు, ఎంపీడీవోలు, స్టేషన్ హౌస్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఫిర్యాదులు, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, సి-విజిల్, సువిధ తదితర అంశాలపై మొదటి దశ శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా బృందాలను ఏర్పాటు చేస్తాం. రిటర్నింగ్ అధికారులు సమన్వయంతో పని చేస్తూ సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలి. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల నుంచి వచ్చే ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను తప్పనిసరిగా లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలి. ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీల నిర్వహణకు వారి నుంచి సువిధ యాప్తో పాటు ఆఫ్లైన్లో వచ్చే దరఖాస్తులను పరిశీలించాలి. ఎన్నికల నియమావళికి లోబడి ఎప్పటికప్పుడు అనుమతులు మంజూరు చేయాల’ని తెలిపారు. ఎలకా్ట్రనిక్ ప్రకటనలకు ఎంసీఎంసీ ధ్రువీకరణ, ముందస్తు అనుమతులు తప్పనిసరి అని డీఐపీఆర్వో కె.చెన్నకేశవరావు తెలిపారు. వీటికి సంబంధించి ప్రసారమయ్యే రాజకీయ ప్రకటనలను ఎంసీఎంసీ కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు. ముఖ్య ప్రణాళికా అధికారి ప్రసన్నలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తనిఖీల్లో రూ.10లక్షల కంటే ఎక్కువ నగదు సీజ్ చేస్తే ఐటీ అధికారులకు అప్పగించాలని తెలిపారు. సీజ్ చేసిన నగదు, బంగారం వివరాలు, అప్పీల్ చేయవలసిన అంశాలకు సంబంధించిన రశీదును తప్పనిసరిగా అందించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈవో ఆర్.వెంకట్రామన్, ట్రైనింగ్ మేనేజ్మెంట్ ఎన్.బాలాజీ పాల్గొన్నారు.