గ్రామాల్లో తాగునీటి కష్టాలు
ABN , Publish Date - May 17 , 2024 | 12:31 AM
ఒకవైపు వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రమవుతున్న నేపఽథ్యంలో మండల పరిధిలోని గ్రామాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గ్రామాల్లోని బావుల్లో పూర్తిగా నీరు ఎండిపోవడమే కాకుండా తాగునీటి కొళాయిల ద్వారా అందిస్తున్న నీటి సరఫరా కనీస అవసరాలకే చాలడం లేదని మహిళలు వాపోతున్నారు.
- అడుగంటిన నేల బావులు
- నీటి సరఫరా చేయాలని కోరుతున్న మహిళలు
కంచిలి: ఒకవైపు వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రమవుతున్న నేపఽథ్యంలో మండల పరిధిలోని గ్రామాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గ్రామాల్లోని బావుల్లో పూర్తిగా నీరు ఎండిపోవడమే కాకుండా తాగునీటి కొళాయిల ద్వారా అందిస్తున్న నీటి సరఫరా కనీస అవసరాలకే చాలడం లేదని మహిళలు వాపోతున్నారు. గ్రామాల్లోని తాగునీటి పథకాల ద్వారా సరఫరా చేస్తున్న నీరు చాలా తక్కువగా ఉంటోందని, కనీస అవసరాలే తీరడం లేదని మహిళలు చెబుతున్నారు. చాలాచోట్ల కొళాయి పైపులు సరిగా లేక నీరు వృథాగా పోతోంది. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించేందుకు అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోకపోవడంతో సగానికి పైగా గ్రామాలకు పైపు లైనులు కూడా వేయని దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని మహిళలు కోరుతున్నారు.
అడుగంటిన బావులు
సరైన వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి, చెరువుల్లో నీళ్లులేని పరిస్థితులు నెలకొంది. దీనికితోడు గ్రామాల్లోని బావులు సైతం అడుగంటడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంచిలి మెయిన్ రోడ్డుతోపాటు ఎస్ఆర్సీ పురం, పురుషోత్తపురం, గొల్లకంచిలి, జెన్నాఘయి, ఎంఎస్ పల్లి, అంపురం, దాళేశ్వరం తదితర గ్రామాల్లో బావులు అడుగంటి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
సత్వర చర్యలు చేపట్టండి
వేసవి తీవ్రత పెరుగుతున్న నేపఽథ్యంలో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని స్థానికులంతా కోరుతున్నారు. అలాగే మరమ్మతులకు గురైన తాగునీటి పథకాలను బాగుచేయించాలని వారంతా కోరుతున్నారు.
పరిష్కారానికి చర్యలు
గ్రామాల్లో తాగునీటికి సంబంధించి సమస్య మా దృష్టికి వచ్చింది. రెండు రోజుల్లో ఈ సమస్య పరిష్కారానికి కృషిచేస్తాం. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుం డా చర్యలు తీసుకుంటాను.
- సతీష్, జేఈ ఆర్డబ్ల్యూఎస్