జిల్లా ఎక్సైజ్ శాఖలో కలకలం
ABN , Publish Date - Aug 30 , 2024 | 11:30 PM
జిల్లా ఎక్సైజ్ శాఖలో కలకలం రేగింది. ఎచ్చెర్లలోని మద్యం బాట్లింగ్ యూనిట్లో జరుగుతున్న ట్రాన్స్పోర్ట్ చార్జీల అక్రమాలకు సంబంధించి ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం వచ్చిన ‘వామ్మో.. స్కెచ్ పెద్దదే!’ కథనంతో ఆ శాఖ అధికారులు ఉలికిపాటుకు గురయ్యారు.
- ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఉలికిపాటు
- ట్రాన్స్పోర్ట్ చార్జీల అక్రమాలపై అంతర్గత విచారణకు ఆదేశించిన ఎక్సైజ్ డైరక్టర్
(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)
జిల్లా ఎక్సైజ్ శాఖలో కలకలం రేగింది. ఎచ్చెర్లలోని మద్యం బాట్లింగ్ యూనిట్లో జరుగుతున్న ట్రాన్స్పోర్ట్ చార్జీల అక్రమాలకు సంబంధించి ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం వచ్చిన ‘వామ్మో.. స్కెచ్ పెద్దదే!’ కథనంతో ఆ శాఖ అధికారులు ఉలికిపాటుకు గురయ్యారు. ఆ శాఖలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక స్థాయి అధికారి, ఔట్సోర్సింగ్ ఉద్యోగిపై ఇప్పటికే ప్రొహిబిషన అండ్ ఎక్సైజ్ డైరక్టర్ నిషాంత్కుమార్కు ఫిర్యాదు చేరినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతోపాటుగా ‘ఆంధ్రజ్యోతి’ కథనం కూడా డైరక్టర్కు చేరడంతో అంతర్గత విచారణకు ఆయన ఆదేశించినట్లు తెలిసింది. దీంతో ఎక్కడ దొంగలు అక్కడే గుప్చప్ అన్నరీతిన మౌనం వహిస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ చార్జీల అక్రమాలకు తాత్కాలికంగా కళ్లెం వేసి, డ్రైవర్లకు బకాయిలు చెల్లించి తమ తప్పు లేదని నిరూపించేందుకు తంటాలు పడుతున్నారు. ఈ మేరకు కీలక అధికారితో పాటు అక్రమాలకు చేయూతగా ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు సమాచారం. త్వరలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరక్టర్ విచారణ దర్యాప్తు నివేదిక వెల్లడైతే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి.