Share News

బాలుడి మృతిపై డీసీహెచ్‌ఎస్‌ విచారణ

ABN , Publish Date - Jun 02 , 2024 | 11:36 PM

జిల్లా కేంద్రాసుపత్రిలో గత నెల 21న చిన్ననారాయణపురం గ్రామానికి చెందిన దాసరి సాయివినీత్‌ మృతిచెందిన విషయం విధితమే. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే తమ కుమారుడి మృతికి కారణమని సాయివినీత్‌ తల్లిదండ్రులు దాసరి మురళి, నిరోషా ఇటీవల పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

బాలుడి మృతిపై డీసీహెచ్‌ఎస్‌ విచారణ
విచారణ చేస్తున్న జిల్లా ప్రాంతీయ ఆసుపత్రుల సమన్వయ అధికారి రాజ్యలక్ష్మి

టెక్కలి, జూన్‌ 2: జిల్లా కేంద్రాసుపత్రిలో గత నెల 21న చిన్ననారాయణపురం గ్రామానికి చెందిన దాసరి సాయివినీత్‌ మృతిచెందిన విషయం విధితమే. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే తమ కుమారుడి మృతికి కారణమని సాయివినీత్‌ తల్లిదండ్రులు దాసరి మురళి, నిరోషా ఇటీవల పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో శనివారం కథనం ప్రచురితమవడంతో అధికారులు స్పందించారు. ఆదివారం జిల్లా ప్రాంతీయ ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్‌ జీవీ రాజ్యలక్ష్మి, ఏడీ శేషగిరిరావు చిన్ననారాయణపురంలో సాయివినీత్‌ తల్లిదండ్రుల వద్ద జరిగిన సంఘటనపై ఆరాతీసి వివరాలు సేకరించారు. ‘మా కుమారుడికి పాము కరిచిన తర్వాత ఆస్పత్రికి సకాలంలో తీసుకెళ్లినా రెండుగంటలపాటు వైద్యసేవలు అందించలేదు. సెలైన్లు, యాంటీవీనమ్స్‌ వంటి మందులు వాడలేదు. బాబు కాలికి ముల్లు గుచ్చిందనే నెపంతో వైద్యులు, సిబ్బంది కాలయాపన చేశారు. అందుకే తమకు కుమారుడు మృతి చెందాడు’ అని దాసరి మురళి, నిరోషా వారికి వివరించారు. తమకు జరిగిన అన్యాయం.. ఇంకెవరికీ జరగకూడదని.. నిర్లక్ష్యం వహించిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Updated Date - Jun 02 , 2024 | 11:36 PM