Share News

అమ్మవార్లకు చల్లదనం

ABN , Publish Date - May 21 , 2024 | 11:26 PM

జిల్లాలోని పలు గ్రామాల్లో మంగళవారం మహిళలు గ్రామదేవత లకు చల్లదనం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఊరేగింపులతో గ్రామాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.

అమ్మవార్లకు చల్లదనం
ఎల్‌ఎన్‌పేట: అమ్మవారి ఆలయాలకు కలశాలతో బయలుదేరిన మహిళలు

ఎల్‌.ఎన్‌.ఎన్‌.పేట: జిల్లాలోని పలు గ్రామాల్లో మంగళవారం మహిళలు గ్రామదేవత లకు చల్లదనం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఊరేగింపులతో గ్రామాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. లక్ష్మీనర్సుపేటలో జరుగుతున్న బంగారు సంతోషిమాత గ్రామదేవత ఉత్సవాల్లో భాగం గా మంగళవారం గ్రామస్థులు కలశాలు పట్టుకుని గ్రామానికి చుట్టూ ఉన్న ఉత్తర అమ్మవారు, పాతపట్నం నీలమణిదుర్గమ్మ, దక్షిణ అమ్మవారు, తరిణా అమ్మవార్లకు చల్లదనం చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు. మంగళ వాయిద్యాలతో గ్రామస్థులంతా ఒక్క సారి బయలు దేరడంతో వీధులన్నీ కిటకిటలాడాయి. ఉత్సవాలు ముగిసేంతవరకు అమ్మవారు ప్రతిరోజూ వివిధ రూపాల్లో దర్శన మిస్తారని గ్రామస్థులు తెలిపారు. కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.

ఘనంగా గోదావరి పోలమ్మ వారాలు

సంతబొమ్మాళి: సంతబొమ్మాళిలో గోదావరి పోలమ్మ తల్లి వారాల పండుగ మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా వైశాఖ మాసంలో గ్రామస్థులంతా కలిసి వారాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా అమ్మవారిని పురవీధుల్లో మేళతాళాలు, డప్పులు, తప్పెడుగుళ్ల ప్రదర్శన మధ్య ఊరేగించారు. అనంతరం ఆలయానికి చేరుకుని అమ్మవారికి ముర్రాటలు పోసి చల్లదనం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

కొత్తపేట సంబరాలు

వజ్రపుకొత్తూరు: కొత్తపేట గ్రామంలోని గ్రామదేవత పెద్దమ్మ తల్లి ఉత్సవాలు మంగళ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని గ్రామస్థులు దర్శించుకుని ముర్రాటలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా యువకుల పగటి వేషాలు ఆకటు ్టకున్నాయి. కార్యక్రమంలో టీడీపీ పలాస సమన్వయకర్త వెంకన్న చౌదరి, మాజీ సర్పంచ్‌ గోవింద పాపారావు తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

పెద్దమ్మతల్లికి ముర్రాటల సమర్పణ

జలుమూరు: పెద్దదూగాంలో వెలసిన పెద్దమ్మతల్లి గ్రామదేవతకు గ్రామస్థులు మంగళవారం ముర్రాటలు సమర్పించి చల్లదనం చేశారు. ప్రతీ ఏటా తొలకరి వర్షాలు పడగానే ఆవేటిలో గ్రామదేవతకు చల్లదనం చేసి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగా ఉదయం మంగళ వాయిద్యాల నడుమ మహిళలు ముర్రాటలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది.

ఘనంగా ఆవేటి వారాలు

హిరమండలం: సుభలయ ఆర్‌ఆర్‌ కాలనీ పంచాయతీలో మంగళవారం గ్రామ దేవతల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన మహిళలు కలశాలు, ముర్రాటలతో మేళ తాళాల మధ్య ఆలయాలకు వెళ్లి మొక్కులు చెల్లించారు. చెవిటమ్మ తల్లి, కొండ దేవతమ్మ, కొండ జాకరమ్మ, నీలమణిదుర్గ అమ్మవారు, అగ్రహారం తల్లి ఆలయాలకు వెళ్లి ముర్రాటలు సమర్పించి చల్లదనం చేశారు.

Updated Date - May 21 , 2024 | 11:26 PM