నారాయణపురం కొండ ఆక్రమణ
ABN , Publish Date - Feb 20 , 2024 | 11:47 PM
వజ్రపుకొత్తూరు మండలం పెద్దబొడ్డపాడు పంచాయతీలోని నారా యణపురం కొండ ఆక్రమణకు గురవుతోంది. సర్వేనెంబరు 242 నుంచి 252 పరిధిలో సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఈ కొండ విస్తరించి ఉంది.
- సుమారు 50 ఎకరాలు కబ్జా
- చోద్యం చూస్తున్న అటవీశాఖ
(వజ్రపుకొత్తూరు)
వజ్రపుకొత్తూరు మండలం పెద్దబొడ్డపాడు పంచాయతీలోని నారా యణపురం కొండ ఆక్రమణకు గురవుతోంది. సర్వేనెంబరు 242 నుంచి 252 పరిధిలో సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఈ కొండ విస్తరించి ఉంది. అటవీశాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ కొండ భూములపై అక్రమార్కుల కన్ను పడింది. 50 ఎకరాల మేర ఆక్రమణకు గురైంది. అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆక్రమణదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మండలంలోని బెండి, అనంతగిరి కొండలు ఇప్పటికే ఆక్రమణకు గురి కాగా.. నారాయణపురం కొండ కూడా కబ్జా చేస్తుండడంపై ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ ఎకరా విలువ రూ.10లక్షలకుపైగా ఉందని పేర్కొంటున్నారు. ఆక్రమణదారులు ముందుగా కంచె వేసి.. ఆపై తోటల పెంపకానికి సిద్ధమవుతూ కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొండ ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఈ భూములు తమ ఆధీనంలో లేవని రెవెన్యూ అధికారులు చెబుతుండగా.. అటవీశాఖ అధికారులకు ఉన్నతాధికారులకు నివేదిస్తామంటూ కాలయాపన చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. ఈ విషయమై అటవీశాఖ అధికారి భాస్కర్రెడ్డి వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. ఆక్రమణలపై ఫిర్యాదులు అందాయని తెలిపారు. పరిశీలించి.. ఆక్రమణలు తొలగిస్తామన్నారు.
తొలగించాలి
నారాయణపురం కొండ ఆక్రమణ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదు. ఆక్రమణలపై మండల సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించాను. అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశా. ఆక్రమించిన వారిలో ధనికులే ఉన్నారు. ఆక్రమణలు తొలగించి పంచాయతీలో పేదలకు భూమిని పంచిపెట్టాలని అధికారులను కోరాను. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్తామని అటవీశాఖ అధికారులు చెప్పారు.
- తమ్మినేని ఢిల్లీరావు, సర్పంచ్, పెద్దబొడ్డపాడు