Share News

తీరంలో భద్రత ఏదీ?

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:30 PM

జిల్లాలో తరచూ తుఫాన్లు సంభవిస్తుంటాయి. మత్స్యకారులు వేటకు వెళ్లి ప్రమాదాలకు గురవుతుంటారు. మరికొందరు తీర ప్రాంతాల్లో విహారయాత్రకు వచ్చి సముద్ర స్నానానికి దిగుతుంటారు. ఈ క్రమంలో ఏటా పదుల సంఖ్యలోనే మృత్యువాత పడుతున్నారు. కానీ దీనిని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు కానరావడం లేదు. దీనికి సరైన రక్షణ వ్యవస్థ లేకపోవడమే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

తీరంలో భద్రత ఏదీ?

- మెరైన్‌ స్టేషన్ల ఏర్పాటులో జాప్యం

- 11 మండలాలకు ఉన్నవి మూడే..

- సిబ్బంది కొరతతో తీవ్ర ఇక్కట్లు

ఇచ్ఛాపురం, అక్టోబరు 25(ఆంరఽధజ్యోతి): జిల్లాలో తరచూ తుఫాన్లు సంభవిస్తుంటాయి. మత్స్యకారులు వేటకు వెళ్లి ప్రమాదాలకు గురవుతుంటారు. మరికొందరు తీర ప్రాంతాల్లో విహారయాత్రకు వచ్చి సముద్ర స్నానానికి దిగుతుంటారు. ఈ క్రమంలో ఏటా పదుల సంఖ్యలోనే మృత్యువాత పడుతున్నారు. కానీ దీనిని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు కానరావడం లేదు. దీనికి సరైన రక్షణ వ్యవస్థ లేకపోవడమే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తీరం వెంబడి 11 మండలాల్లో.. మండలానికి ఒకటి చొప్పున మెరైన్‌ పోలీస్‌ స్టేషన్లు ఉండాలి. కానీ ఉన్నది మూడే. దాదాపు 120 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా.. సగం మందికి మించి లేరని తెలుస్తోంది. ఫలితంగా తీర ప్రాంత రక్షణ డొల్లగా మారుతోంది.

...............

సుదీర్ఘ తీరప్రాంతం జిల్లా సొంతం. ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి రణస్థలం మండలం దోనిపేట వరకూ 193 కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది. రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం రూరల్‌, గార, పోలాకి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో తీర ప్రాంతం ఉంది. 143 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. మారుమూల కుగ్రామాలు 20వరకూ ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా తీర ప్రాంతాల్లో భద్రత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వందలాది కిలోమీటర్లు ఉన్న తీర ప్రాంతంలో ఉన్నది మూడే మెరైన్‌ పోలీస్‌స్టేషన్లు. వీటి సంఖ్య పెంచుతామన్న ప్రకటనలు ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. వాస్తవానికి కానిస్టేబుల్‌కు ఒక గ్రామం చొప్పున బాధ్యతలు అప్పగించాలి. కానీ సిబ్బంది కొరత కారణంగా ఐదు నుంచి పది గ్రామాల బాధ్యతను ఒక్కో కానిస్టేబుల్‌ చూస్తున్న సందర్భాలు ఉన్నాయి. తుఫాన్ల సమయంలో మత్స్యకారులను అప్రమత్తం చేయడం.. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించడం ఇబ్బందిగా మారుతోంది.

- ఆ మూడుచోట్ల ఏర్పాటు..

జిల్లాలో కళింగపట్నం, భావనపాడు, బారువలో మెరైన్‌ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. సముద్ర తీరంలో 12 నాటికల్‌ మైళ్ల దూరం వరకూ నిరంతర భద్రతా చర్యలు పర్యవేక్షించాలి. విదేశీ మత్స్యకారులు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే అదుపులోకి తీసుకోవాలి. నేవీ విభాగానికి సమాచారం అందించాలి. కానీ ఓ వైపు సిబ్బంది కొరత, మరోవైపు విధి నిర్వహణకు అవసరమైన మరబోట్లు, అత్యాధునిక పరికరాలు కూడా లేని దుస్థితి. దీంతో సిబ్బంది బాధలు వర్ణనాతీతం. గతంలో సమకూర్చిన మరబోట్లు, పరికరాలు తితలీ తుఫాన్‌ సమయంలో పాడయ్యాయి. కానీ వాటి స్థానంలో కొత్తవి సమకూర్చలేదు.

- 11 తీర మండలాల బాధ్యతను మూడు మెరైన్‌ పోలీస్‌స్టేషన్లకు అప్పగించారు. బారువ మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇచ్ఛాపురం, సోంపేట, కవిటి, మందస మండలాలు ఉన్నాయి. 36 తీర ప్రాంత రెవెన్యూ గ్రామాలు, మరో ఐదు శివారు గ్రామాలున్నాయి. ఇక్కడ 42 మంది కానిస్టేబుళ్లకు 9 మంది మాత్రమే ఉన్నారు. ఇతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో శివారు మండలాల్లో విధుల నిర్వహణ కష్టతరంగా మారుతోంది. ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి మందస మండలం గంగువాడ వరకూ విధి నిర్వహణ కత్తిమీద సాములా మారింది. తీర ప్రాంతాల పర్యవేక్షణ తూతూమంత్రంగా సాగుతోంది.

- భావనపాడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి మండలాల్లో 63 తీరప్రాంత రెవెన్యూ గ్రామాలున్నాయి. మరో ఏడు శివారు గ్రామాలున్నాయి. ఇక్కడ 82మంది సిబ్బంది ఉండాలి. కానీ కేవలం 29మంది మాత్రమే ఉన్నారు. ఖాళీలు, అరకొర వసతులతో తీర ప్రాంత రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది.

- కళింగపట్నం పరిధిలో గార, శ్రీకాకుళం రూరల్‌, రణస్థలం, ఎచ్చెర్ల మండలాల్లో 43 తీర ప్రాంత రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ 48 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహించాల్సి ఉండగా.. కేవలం 18 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం.. తీరప్రాంతాల్లో భద్రతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మెరైన్‌ పోలీసుస్టేషన్లతో పాటు పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాల్సి ఉంది.

Updated Date - Oct 25 , 2024 | 11:30 PM