పోర్టు వద్ద ‘అల’జడి
ABN , Publish Date - May 26 , 2024 | 11:12 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన రీమల్ తుఫాన్ ప్రభావంతో మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు వద్ద సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి.
- సౌత్బ్రేక్ గట్టుపైకి చొచ్చుకొచ్చిన కెరటాలు
- నీటిని తొలగించేందుకు యంత్రాంగం చర్యలు
టెక్కలి, మే 26: బంగాళాఖాతంలో ఏర్పడిన రీమల్ తుఫాన్ ప్రభావంతో మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు వద్ద సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. పోర్టు వద్ద 2.4 కిలోమీటర్ల నిడివి గల సౌత్బ్రేక్ గట్టుపైకి కెరటాలు చొచ్చుకొస్తున్నాయి. గత ఎనిమిది నెలలుగా సంబంధిత కాంట్రాక్టర్లు నార్త్బ్రేక్, సౌత్బ్రేక్ గట్లను ఏర్పాటు చేసి దానిపక్కన రాళ్లు జారకుండా ఉండేందుకు ఇండోపాట్ పెట్టారు. అయినప్పటికీ అలల ఉధృతికి నీరు రాళ్లపైకి చేరుతోంది. దీంతో ఇసుక కరిగిపోయి మళ్లీ సముద్రంలోకి వెళ్లిపోతుంది. ఇది సౌత్బ్రేక్పై ప్రభావం చూపుతుంది. దీంతో కాంట్రాక్టర్లు ఆందోళనకు గురవుతున్నారు. తుఫాన్ ప్రభావం జిల్లాపై పెద్దగా లేకపోయినప్పటికీ ఈ పరిస్థితి ఏర్పడిందని, ఒకవేళ భారీ తుఫాన్లు ఏర్పడితే పరిస్థితి ఏమిటని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు తలలు పట్టుకుంటున్నా రు. ఇప్పటికే ఆ ప్రాంతంలో కొంతమేరకు డ్రెడ్జింగ్ పనులు జరిగినప్పటికీ మళ్లీ ఇసుక మేటలు వేయడంపై ఆందోళనకు గురవుతున్నారు. సౌత్బ్రేక్పై నుంచి వస్తున్న నీటిని తొలగించడానికి యంత్రాంగం చర్యలు చేపడుతుంది.