Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , Publish Date - Mar 18 , 2024 | 11:58 PM

పెద్దమర్రిపాడు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడకు చెందిన తేరిపల్లి లోకనాథం(33) మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

సంతబొమ్మాళి: పెద్దమర్రిపాడు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడకు చెందిన తేరిపల్లి లోకనాథం(33) మృతి చెందాడు. నౌపడ పోలీ సులు, కుటుంబ సభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి.. చినమర్రిపాడులో జరుగుతున్న ఎల్లమ్మ జాతరకు లోకనాథం బైక్‌పై వెళ్లాడు. తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన ఆటో పెద్దమర్రిపాడు చెరువు వద్ద ఉన్న రోడ్డు మలుపులో ఎదురెదు రుగా ఢీ కొన్నాయి. సమాచారం అందుకున్న నౌపడ పోలీసులు హుటాహుటిన అక్క డికి వచ్చి తీవ్రంగా గాయపడిన లోకనాథాన్ని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. కాగా లోకనాథం దేవునల్లాడ సర్పంచ్‌ తేరిపల్లి వరదరాజు సోదరుడు. దీంతో దేవునల్తాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నౌపడ ఎస్‌ఐ కిశోర్‌ వర్మ తెలిపారు.

లారీ ఢీకొని విద్యార్థి..

కొత్తూరు: మాసింగి గ్రామం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్‌ చదువుతున్న పాలక కల్యాణ్‌(16) మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కల్యాణ్‌ భామినిలోని స్నేహితులైన మణికంఠ, వంశీలతో కలిసి ద్విచక్ర వాహనంపై సీతంపేట వైపు నుంచి కొత్తూరు వస్తుండగా.. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో కల్యాణ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితులిద్దరూ తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం కొత్తూరు సామాజిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాగోలు జెమ్స్‌కి తరలించారు. కల్యాణ్‌ తల్లి రమణమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Mar 18 , 2024 | 11:58 PM