ఉద్దానంలో ఎలుగు
ABN , Publish Date - Aug 24 , 2024 | 11:54 PM
ఉద్దానం ప్రాంతంలోని మందస మండలం దున్నూరు, గెడ్డూరు తదితర గ్రామాల రోడ్లపై శనివారం ఉదయం ఎలుగుబంటి సంచరించడంతో ప్రజలు భయాందోళన చెందారు.
హరిపురం, ఆగస్టు 24: ఉద్దానం ప్రాంతంలోని మందస మండలం దున్నూరు, గెడ్డూరు తదితర గ్రామాల రోడ్లపై శనివారం ఉదయం ఎలుగుబంటి సంచరించడంతో ప్రజలు భయాందోళన చెందారు. వారం రోజులు కిందట రాత్రి సమయంలో మూడు తల్లీ పిల్లల ఎలుగులు.. పితాలి, తోటూరు, చిన్నలోహరిబంద గ్రామాల పరిసరాల్లో మకాం వేసి వీరంగం సృష్టించాయి. ఏడాది కిందట ఎర్రముక్కాం, దున్నూరు గ్రామాల్లో ఎలుగుబంట్లు దాడి చేయగా.. ఇద్దరు మృతి చెందారు. మరికొందరు గాయాలపాలయ్యారు. వజ్రపుకొత్తూరు మండలంలో కూడా ఎప్పటికప్పుడు ఎలుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ఉద్దానం ప్రాంతం ప్రజలు రాత్రి ఆరు దాటితే చాలు ఇంటి నుంచి బయటకు రావడానికి హడలిపోతున్నారు. పగలు కూడా తోటల్లో పనులు చేసేందుకు భయపడుతున్నారు. అటవీ అధికారులు స్పందించి ఎలుగుబంట్ల నుంచి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.