ఒంగోలులో వైసీపీ ర్యాలీ రగడ
ABN , Publish Date - Apr 23 , 2024 | 11:36 PM
ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని నామినేషన్ వ్యవహారం రోడ్డెక్కింది. భారీ ఎత్తున జన సమీకరణ, నగరంలో ప్రతి ఒక్కరూ చర్చించుకునేలా చేయాలని సోమవారం ఏర్పాటు చేసిన నామినేషన్ ర్యాలీ వ్యవహారం ఆ పార్టీ నేతలకు పలు డివిజన్లలో తలనొప్పిగా మారింది.
డబ్బులు ఇవ్వలేదని మహిళలు నిలదీత
ఒంగోలు (కార్పొరేషన్), ఏప్రిల్ 23 : ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని నామినేషన్ వ్యవహారం రోడ్డెక్కింది. భారీ ఎత్తున జన సమీకరణ, నగరంలో ప్రతి ఒక్కరూ చర్చించుకునేలా చేయాలని సోమవారం ఏర్పాటు చేసిన నామినేషన్ ర్యాలీ వ్యవహారం ఆ పార్టీ నేతలకు పలు డివిజన్లలో తలనొప్పిగా మారింది. జన సమీకరణ కోసం ర్యాలీకి వచ్చేవారికి రూ.300 ఆశగా చూపారు. డబ్బుల పంపిణీ వ్యవహారం రచ్చగా మారింది. ఒక్కో డివిజన్ నుంచి 250 మంది ప్రజలను తరలించే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. కొన్ని డివిజన్లో అంతే స్థాయిలో జనం రాగా, మరికొన్ని డివిజన్ల నుంచి జనం స్పందన కరువైంది. దీంతో వైసీపీ స్థానిక నాయకులు డబ్బులు నొక్కే ప్రయత్నాలు చేశారు. దీంతో అసలు గుట్టురట్టు అయింది. మంగళవారం నగరంలోని మిరియాలపాలెం వద్ద పలువురు మహిళలు వైసీపీ నాయకులను నిలదీశారు. ర్యాలీలో పాల్గొంటే తమకు రూ.300 ఇవ్వలేదని నిలదీయగా,మీపేరు లిస్ట్లో లేదంటూ వైసీపీ నేతలు చెప్పడంతో వారి మధ్య మాటలు పేలినట్లు సమాచారం. ఈ వ్యవహారం గంటకుపైగా సాగినా ఆ సమీపంలోని ఉన్న పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం.