నీటి పథకాలకు వైసీపీ ఎగనామం
ABN , Publish Date - Apr 26 , 2024 | 11:35 PM
అద్దంకి పట్టణంలో మంచినీటి సరఫరాలో రెండున్న దశాబ్దాల క్రితం పరిస్థితులు మరలా వచ్చాయా అన్న భయం మళ్లీ మొదలైంది. రెండున్నర దశాబ్దాల కిందట పట్టణ అవసరాలకు సరిపడా నీటి సరఫరా లేదు. వేసవి కాలం వస్తే ఊటబావులలో నీటి లభ్యత లేక తాగు నీటి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు వచ్చేవి. అప్పటి మేజర్ పంచాయతీ సర్పంచ్గా సందిరెడ్డి శ్రీనివాసరావు తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించి పొలాలలో ప్రత్యేకంగా బోర్లు వేసి తాగునీటి కష్టాల నుంచి పట్టణ ప్రజలను గట్టెక్కించారు. అనంతరం పెద్దగా నీటి సమస్య ఉత్పన్నం కాలేదు.
పనులు పూర్తికాక ఇబ్బందులు
పూర్తి స్థాయిలో సరఫరాకాని నీరు
రెండ్రోజులకోసారి రంగుమారినవి విడుదల
ప్రజల ఆందోళన
అధికారులు, పాలకవర్గం పర్యవేక్షణ కరువు
అద్దంకి, ఏప్రిల్ 26 : అద్దంకి పట్టణంలో మంచినీటి సరఫరాలో రెండున్న దశాబ్దాల క్రితం పరిస్థితులు మరలా వచ్చాయా అన్న భయం మళ్లీ మొదలైంది. రెండున్నర దశాబ్దాల కిందట పట్టణ అవసరాలకు సరిపడా నీటి సరఫరా లేదు. వేసవి కాలం వస్తే ఊటబావులలో నీటి లభ్యత లేక తాగు నీటి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు వచ్చేవి. అప్పటి మేజర్ పంచాయతీ సర్పంచ్గా సందిరెడ్డి శ్రీనివాసరావు తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించి పొలాలలో ప్రత్యేకంగా బోర్లు వేసి తాగునీటి కష్టాల నుంచి పట్టణ ప్రజలను గట్టెక్కించారు. అనంతరం పెద్దగా నీటి సమస్య ఉత్పన్నం కాలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అద్దంకి పట్టణానికి రాబోయే నాలుగైదు దశాబ్దాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సుమారు రూ.85కోట్లతో మంచినీటీ పథకానికి నిధులు కేటాయించి పనులు కూడా ప్రారంభించారు. గత ఐదేళ్ల కాలంలో అధికార వైసీపీ ఆ పనులు పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమైంది. దీనికి తోడు అద్దంకి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో (గతంలో పంచాయతీ కార్యాలయం) నాలుగు దశాబ్దాల కిందట నిర్మించిన ఓవర్హెడ్ ట్యాంక్ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దీంతో నీటిని ట్యాంక్కు ఎక్కించకుండా నేరుగా సరఫరా చేస్తున్నారు. అదే సమయంలో కాకానిపాలెం ట్యాంక్కు నీటిని పంపింగ్ చేసే మోటార్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. రామ్నగర్ ట్యాంక్కు నీటి సరఫరా చేసే పైప్ లైన్లు తరచూ పోతున్నాయి. దీంతో తరచూ నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. రామ్నగర్ ట్యాంక్ పరిధిలో కొన్ని ప్రాంతాలలో ఇటీవల కాలంలో రోజు మార్చి రోజు నీటిని ఇస్తున్నారు. అదే సమయంలో గతంలో విడుదల చేసే నీటిలో సగం కూడా విడుదల కావడం లేదు. దీంతో పక్షం రోజులుగా అద్దంకి పట్టణంలో నీటి కష్టాలు ఏర్పడ్డాయి.
రంగుమారిన నీరు సరఫరా
అసలే అంతంత మాత్రంగా సరఫరా అవుతున్న నీటి కి తోడు రంగుమారిన నీరు వస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాధారణ అవసరాలకు కూడా ఇవి వాడుకునేలా లేకపోవడంతో పాబోస్తున్నారు. ప్రధానంగా మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉన్న ట్యాంక్ పరిధిలో నీరు ట్యాంక్కు పంపింగ్ చేయకుండా నేరుగా వదులుతుండడంతో రంగు మారిన నీరు వస్తోందని ప్రజలు వాపోతున్నారు. పైపులలో పేరుకు పోయిన మట్టి నీటిలో కలుస్తుండడంతో ఇలా వస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తరచూ పైప్లైన్లలో లో పేరుకుపోయిన మట్టి, మలినాలను బయటకు వదిలి వేసేలా చూసాక నీటిని విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మున్సిపల్ అధికారులతో పాటు పాలకవర్గం కూడా పర్యవేక్షణ లేకపోవడంతో వారం రోజులుగా రంగుమారిన నీరు సరఫరా అవుతుంనదది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మంచినీటిని పూర్తిస్థాయిలో సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.