Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

ప్రమోషను కావాలని వస్తారు.. పని మాత్రం చేయరా?

ABN , Publish Date - Mar 03 , 2024 | 12:01 AM

‘జీతాలు, ప్రమోషన్లు, అవార్డులు కావాలని నా వద్దకు వస్తారూ.. పని మాత్రం చేయరా..? ట్యాబులు పనిచేయకపోతే పట్టించుకోరూ, సిలబస్‌ పూర్తికాకుండానే పరీక్షలు నిర్వహిస్తారు.. అయినా పర్యవేక్షణాధికారులు మాత్రం పట్టించుకోరు.. పిల్లల చదువులు ఏమాత్రం బాగా సాగటం లేదు, ఈ తప్పులకు ఎవరిని బాధ్యులు చేయాలి, ఎలాంటి శిక్షలు విధించాలి’ అని విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ అటు విద్యాశాఖాధికారులు, ఇటు టీచర్లపై మండిపడ్డారు.

ప్రమోషను కావాలని వస్తారు..  పని మాత్రం చేయరా?
గాడిపర్తివారిపాలెం హైస్కూల్‌లో అధికారులు,టీచర్లపై మండిపడుతున్న ప్రవీణ్‌ ప్రకాష్‌

-చీమకుర్తి మండలం రిమోట్‌ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు

చీమకుర్తి, మార్చి 2: ‘జీతాలు, ప్రమోషన్లు, అవార్డులు కావాలని నా వద్దకు వస్తారూ.. పని మాత్రం చేయరా..? ట్యాబులు పనిచేయకపోతే పట్టించుకోరూ, సిలబస్‌ పూర్తికాకుండానే పరీక్షలు నిర్వహిస్తారు.. అయినా పర్యవేక్షణాధికారులు మాత్రం పట్టించుకోరు.. పిల్లల చదువులు ఏమాత్రం బాగా సాగటం లేదు, ఈ తప్పులకు ఎవరిని బాధ్యులు చేయాలి, ఎలాంటి శిక్షలు విధించాలి’ అని విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ అటు విద్యాశాఖాధికారులు, ఇటు టీచర్లపై మండిపడ్డారు. శనివారం చీమకుర్తి మండలంలో ఆయన ఆకస్మిక తనిఖీల పర్వం ఆద్యంతం ఉత్కంఠభరితంగా, అధికారులు, టీచర్లను బెంబేలెత్తించే విధంగా సాగింది. ప్రతి శనివారం రాష్ఠ్రవ్యాప్తంగా ప్రవీణ్‌ ప్రకాష్‌ నిర్వహిస్తున్న పాఠశాలల తనిఖీల్లో భాగంగా ఈ శనివారం ఒంగోలు డివిజన్‌లో చీమకుర్తి ఎమార్సీకి వస్తారని ముందుగా సమాచారం అందింది. కానీ మండలంలో చిట్టచివరన రిమోట్‌ ఏరియాలో ఉన్న ఇలపావులూరు, గాడిపర్తివారిపాలెం, గోనేపల్లివారిపాలెం పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. ఆయన వెంట ఆర్‌జేడీ లింగేశ్వరరెడ్డి, డీఈఓ సుభద్ర, డిప్యూటీ డీఈఓ అనితారోజ్‌, ఎంఈఓలు వెంకటేశ్వర్లు, శివాజీ ఉన్నారు. తొలుత ఇలపావులూరులోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల(హెచ్‌ డబ్యూ)ను తనిఖీ చేశారు. విద్యార్థుల వర్క్‌బుక్స్‌ని పరిశీలించారు. ఎఫ్‌ఏ-4కు పూర్తికావాల్సిన లెక్కల సిలబస్‌ పూర్తికాకుండానే పరీక్షలు నిర్వహించటంపై అక్కడ మహిళా టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎంఈఓని వివరణ అడగ్గా తాను ఇటీవల రివ్యూ నిర్వహించినపుడు సిలబస్‌ పూర్తయిందని టీచర్‌ చెప్పారని జవాబిచ్చారు. మీకు అబద్ధం చెప్పారా.. అయితే తాను జిల్లా దాటిపోయేలోపు ఈ విషయంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తర్వాత గోనేపల్లివారిపాలెం పాఠశాలను సందర్శించారు. అక్కడ టీచరు ఒకరే ఉండటంపై అధికారులను ప్రశ్నించారు. అక్కడ నుంచి గాడిపర్తివారిపాలెం హైస్కూల్‌ని తనిఖీ చేశారు. పిల్లలు భోజనం తర్వాత చేతులు కడుక్కునే వాష్‌బేషిన్‌ తరగతి గదిలో ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. నాడు-నేడు కింద రూ.40లక్షలకుపైగా నిధులు మంజూరు చేస్తే దీనిని ఫిట్‌ చేయలేకపోయారా... ఇంజనీర్లు ఏం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. ట్యాబుల వినియోగంపై ప్రశ్నించగా అవి పనిచేయటం లేదని విద్యార్థులు జవాబిచ్చారు. దీనిపై హెచ్‌ఎం, టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోడల్‌ పర్సన్‌ని మందలించారు. హైస్కూల్లో పది మంది టీచర్లు ఉండగా విద్యార్థులు 150మంది మాత్రమే ఉండటం ఏమిటని ప్రశ్నించారు.

Updated Date - Mar 03 , 2024 | 12:01 AM