Share News

హత్య కేసును ఛేదించిన పోలీసులు

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:39 AM

మద్యానికి బానిసై తన అక్కను చిత్రహింసలు పెడుతున్న బావను పథకం ప్రకారం అంతమొందిన బావమరిదిని పోలీసులు అరెస్టు చేశారు.

హత్య కేసును ఛేదించిన పోలీసులు

బావమరిదే హతమార్చినట్లు నిర్దారణ

మద్యానికి బానిసై అక్కను వేధించడమే కారణం

గిద్దలూరు, ఏప్రిల్‌ 18 : మద్యానికి బానిసై తన అక్కను చిత్రహింసలు పెడుతున్న బావను పథకం ప్రకారం అంతమొందిన బావమరిదిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గిద్దలూరు మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన షేక్‌ ఖాజావలి(43)కు హస్మితతో ఇంచుమించు పద్దెనిమెదేళ్ల క్రితం వివాహమైంది. అయితే మద్యానికి బాసిన ఖాజావలి నిత్యం ఆమెను శారీరకంగా మానసికంగా వేధించేవాడు. ఖాజావలి బావ షేక్‌ అబ్దుల్‌ సుభానీ కూడా గిద్దలూరు పట్టణంలోని కొప్పువారివీధిలో నివసిస్తూ అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలోనే ఖాజావలిని అడ్డు తప్పించాలని ఆయన బావమరిది షేక్‌ అబ్దుల్‌ సుభాని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం ఈ నెల 13న అంబులెన్స్‌లో ఎక్కించుకుని గిద్దలూరు నుండి తాటిచెర్లమోటుకు వెళ్లాడు. యడవల్లి సమీపంలో క్రాస్‌ రోడ్డు వద్ద అంబులెన్స్‌ను ఆపి హెడ్‌లైట్లు వెలుగడం లేదని చూడాలని బావ ఖాజావలి చెప్పాడు. ఖాజావలి అంబులెన్స్‌ ముందుకు వెళ్లి హెడ్‌లైట్లు పరిశీలిస్తుండగా డ్రైవింగ్‌లో ఉన్న బావమరిది అబ్దుల్‌సుభాని అంబులెన్స్‌ను ముందుకు నడిపాడు. దీంతో ఖాజావలి రోడ్డుపై పడిపోయాడు. అనంతరం అంబులెన్స్‌ ఎక్కించి ఖాజావలి మృతికి కారణమయ్యాడు. అనంతరం ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడం వలన ఖాజావలి మృతిచెందినట్లు షేక్‌ హస్మత్‌తో ఫిర్యాదు చేయించాడు. అయితే రూరల్‌ సీఐ దాసరి ప్రసాద్‌, రాచర్ల ఎస్సై హరిబాబు పూర్తిస్థాయిలో విచారించారు. బావమరిదే హత్య చేసినట్లు గుర్తించి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ జడ్జి ఆదేశించినట్లు ఎస్సై హరిబాబు గురువారం తెలిపారు. ఘటనపై విచారించే క్రమంలో పోలీసులకు పలు అనుమానాలు వ్యక్తం కావడంతో వారిదైన కోణంలో విచారించడంతో వాస్తవాలు వెలుగుచూశాయి.

Updated Date - Apr 19 , 2024 | 12:39 AM