బీసీలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత టీడీపీదే
ABN , Publish Date - Jan 30 , 2024 | 11:44 PM
బీసీలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. మర్రిపూడిలో మంగళవారం రాత్రి జరిగిన జయహో బీసీ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
![బీసీలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత టీడీపీదే](https://media.andhrajyothy.com/media/2023/20231205/30mrpd1_51342eb39f.gif)
మర్రిపూడి, జనవరి 30 : బీసీలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. మర్రిపూడిలో మంగళవారం రాత్రి జరిగిన జయహో బీసీ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 35శాతం రిజర్వేషన్లు టీడీపీ కల్పిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 24శాతానికి తగ్గించి అన్యాయం చేసిందని విమర్శించారు. వైసీపీ పాలనలో 75మంది బీసీలను అంతమొందించారని, 2,540మందిపై అక్రమ కేసులు బనాయించి వేధించారని ఆరోపించారు. బీసీ సబ్ప్లాన్ నిధులను దారిమళ్లించిన ఘనత వైసీపీకే దక్కిందని ధ్వజమెత్తారు. కొండపి నియోజకవర్గాన్ని స్థానికుడినైన తాను ఎనలేని అభివృద్ధి చేశానన్నారు. ఎర్రగొండపాలెంలో ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న మంత్రి సురేష్ కొండపికి వలసవచ్చి అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేయించడంలో విఫలమైన ఆయన చెత్తమంత్రిగా నిలిచిపోయారని విమర్శించారు. తాను గత టీడీపీ హయాంలో కూచిపూడి నుంచి పొదిలి వరకు రోడ్డు నిర్మాణానికి రూ.39కోట్లు మంజూరు చేయిస్తే పనులు పూర్తి చేయించలేని అసమర్థులు వైసీపీ నాయకులని మండిపడ్డారు. అంతకుముందు స్థానిక విద్యుత్ ఉపకేంద్రం నుంచి బస్టాండు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు నందిగం బ్రహ్మయ్య, జడ్పీటీసీ మాజీ సభ్యుడు నరసింహారావు, తెలుగురైతు రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు, టీడీపీ మండల అధ్యక్షుడు నరసారెడ్డి, బీసీసెల్ మండల అధ్యక్షుడు ఏడుకొండలు, నాయకులు లకులు, బాబు, బాలనరసయ్య,. మోహన్రావు, గురుబ్రహ్మయ, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.