దర్శిపై టీడీపీ తుది కసరత్తు
ABN , Publish Date - Mar 21 , 2024 | 11:49 PM
దర్శి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిపై ఆ పార్టీ అధిష్ఠానం తుది కసరత్తు చేపట్టింది. హైదరాబాద్లో గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ మధ్య జరిగిన చర్చల అనంతరం టీడీపీ అభ్యర్థుల తుది జాబితాపై కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలిసింది.
తాజాగా సత్యా పేరు పరిశీలన
నేడో రేపో తుది నిర్ణయం
రేపో మాపో దర్శి, చీరాల అభ్యర్థుల ప్రకటన
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
దర్శి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిపై ఆ పార్టీ అధిష్ఠానం తుది కసరత్తు చేపట్టింది. హైదరాబాద్లో గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ మధ్య జరిగిన చర్చల అనంతరం టీడీపీ అభ్యర్థుల తుది జాబితాపై కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఇంకా 16 అసెంబ్లీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించాల్సి ఉండగా అందులో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శితోపాటు చీరాల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా దర్శి నుంచి ఇప్పటికే ఆ పార్టీ పరిశీలనలో ఉన్న నాయకుల పేర్లలో జిల్లాకు చెందిన టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావించిన సత్యకు పార్టీ అధిష్ఠానం ఉత్తరాంధ్ర జిల్లా కోఆర్డినేటర్ పదవి అప్పగించింది. ఆ బాధ్యతల నిర్వహణలో సత్యా సఫలీకృతులయ్యారని అధినాయకత్వం భావించినట్లు తెలిసింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకే’ష్ యువగళం పాదయాత్ర సందర్భంగా జిల్లాలో సమస్యలు ఉన్న నియోజకవర్గాల్లో సత్యకు బాధ్యతలు అప్పగించారు. దర్శి పాదయాత్ర సమయంలో సత్య తన వంతు ప్రోత్సాహం అందించారు. ఈ నేపథ్యంలో దర్శి నుంచి సత్యను రంగంలో దింపితే ఎలా ఉంటుందనే అంశంపై గురువారం అధిష్ఠానం ఒక పరిశీలన చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఉమ్మడి జిల్లాకు చెందిన ఒకరిద్దరు ముఖ్య నాయకులతో కూడా కీలక నాయకులు మాట్లాడటం విశేషం. ప్రస్తుతం జనసేన తరఫున పనిచేస్తున్న గరికపాటి వెంకట్తో పాటు టీడీపీ ఇన్చార్జి రవికుమార్, ఇటీవల పార్టీలో చేరిన బాచిన కృష్ణచైతన్య, దివంగత గొట్టిపాటి నర్శయ్య కుమార్తె లక్ష్మీ పేర్లు ఆ పార్టీ పరిశీలన ఉన్న విషయం తెలిసిందే. మధ్యలో టీడీపీలోని ఒకరిద్దరు ముఖ్య నాయకులు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు పేరును అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. వీరందరితోపాటు తాజా పరిస్థితుల నేపథ్యంలో సత్య పేరును పరిశీలిస్తుండటం విశేషం. అలాగే చీరాల నుంచి బీసీ అభ్యర్థిని రంగంలో దించాలనే గట్టి నిర్ణయంతో ఉన్న ఆ పార్టీ అధిష్ఠానం ప్రస్తుత ఇన్చార్జి ఎంఎం కొండయ్యతోపాటు చేనేత వర్గానికి చెందిన గుంటూరు జిల్లాలోని ఒక మహిళ పేరుతోపాటు మరొకరి పేరు ప్రతిపాదనకు వచ్చాయి. అయితే కొండయ్యయాదవ్ పట్ల అధిష్ఠానం ఎక్కువ మొగ్గుచూపుతోంది. దర్శి అభ్యర్థి విషయంలో నేడో రేపో ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత రెండు స్థానాల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇంకోవైపు ఒంగోలు ఎంపీ స్థానం నుంచి మాగుంట రాఘవరెడ్డి పోటీచేస్తారని ఆయన తండ్రి ఎంపీ మాగుంట ప్రకటించి ఉన్నారు. అయితే దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న కొన్ని ఘటనల నేపథ్యంలో తండ్రీకొడుకుల్లో ఎవరైతే బాగుంటుందనే అంశంపై కూడా పరిశీలన చేస్తున్నట్లు సమాచారం.