సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు సస్పెన్షన్
ABN , Publish Date - May 25 , 2024 | 12:14 AM
మార్కాపురం డివిజనల్ పంచాయతీ అఽధికారి కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ జి.శ్రీనివాసులుపై సస్పెన్షన్ వేటుపడింది. ఆయన మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించ డంతోపాటు వారిని నిత్యం వేధింపులకు గురిచేస్తున్న విషయమై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి.
![సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు సస్పెన్షన్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశం
వేధింపులపై విచారణకు కమిటీ
కలెక్టర్ ఉత్తర్వులు
‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్
ఒంగోలు(కలెక్టరేట్), మే 24 : మార్కాపురం డివిజనల్ పంచాయతీ అఽధికారి కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ జి.శ్రీనివాసులుపై సస్పెన్షన్ వేటుపడింది. ఆయన మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించ డంతోపాటు వారిని నిత్యం వేధింపులకు గురిచేస్తున్న విషయమై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. అలాగే బాధిత ఉద్యోగిని కూడా డీపీవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై డీపీవో ఉషారాణి మార్కాపురం డీఎల్పీవో కార్యాలయ సిబ్బందిని ఒంగోలుకు పిలిపించి ఈనెల 20న విచారణ నిర్వహించారు. మహిళా ఉద్యోగుల పట్ల శ్రీనివాసులు అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటం, వేధింపులకు గురిచేస్తుండటం వాస్తవమేనని ధ్రువీకరిస్తూ కలెక్టర్కు నివేదికను అందజేశారు. దాని ఆధారంగా శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ శుక్రవారం కలెక్టర్ దినేష్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. క్రమశిక్షణ చర్యలు ముగిసే వరకు కార్యస్థానం నుంచి బయటకు వెళ్లరాదని అందులో స్పష్టం చేశారు.
సమగ్ర విచారణకు ఆదేశం
సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు వేధింపులపై సమగ్ర విచారణకు కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. కార్యస్థానాల్లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 ప్రకారం స్థానికంగా విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. మార్కాపురం ఎంపీడీవో టి.చందనను ప్రిసైడింగ్ ఆఫీసర్గా, డ్వామా ఏపీడీ కె.నిర్మలాదేవిని, సీడీపీవోని సభ్యులుగా నియమించారు. సమగ్ర విచారణ నిర్వహించి నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. శ్రీనివాసులుపై క్రిమినల్ కేసు పెట్టి ఆయనపై తీసుకున్న చర్యల రిపోర్టును వారంలో సమర్పించాలని కలెక్టర్ తన ఉత్తర్వుల్లో ఆదేశించారు.