సూర్యప్రతాపం
ABN , Publish Date - Apr 19 , 2024 | 01:28 AM
జిల్లాపై సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి.
పశ్చిమప్రాంతంలో 42 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు
మార్కాపురంలో అత్యధికంగా 45 డిగ్రీలు
ఒంగోలు (కలెక్టరేట్), ఏప్రిల్ 18 : జిల్లాపై సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఎండతీవ్రతకు తోడు ఉక్కపోత అధికంగా ఉంటుండటంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. గురువారం పశ్చిమప్రాంతం నిప్పుల కొలిమిలా మారింది. ఎక్కువచోట్ల 42 డిగ్రీలకుపైనే గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మార్కాపురం మరింత మండింది. అక్కడ అత్యధికంగా 45.3 డిగ్రీల ఎండ కాచింది. అర్ధవీడు మండలంలో 44.1, కంభంలో 44.1, దొనకొండలో 44.0, దోర్నాలలో 43.8, హనుమంతునిపాడులో 43.3, కనిగిరిలో 43.8, కొనకనమిట్లలో 43.6, చీమకుర్తిలో 43.2, దర్శిలో 42.8, సీఎస్పురంలో 42.9డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అది జిల్లాకేంద్రమైన ఒంగోలులో 39 డిగ్రీలుగా ఉంది. తూర్పుప్రాంతంలోని ఇతరచోట్ల ఇంచుమించు ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఉదయం 10 గంటలకే భానుడి భగభగలు మొదలవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్న సమయంలో గడపదాటి బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు.