రూ.వంద కొట్టు..1700 పట్టు
ABN , Publish Date - Apr 25 , 2024 | 10:48 PM
వందరూపాయలు ఇవ్వండి.. మీఖాతాకు రూ.1700 పడేలా సెట్ చేస్తామంటూ కొందరు సిబ్బంది ఉపాధి కూలీల నుంచి డబ్బులు గుంజుతున్నారు. మండలంలోని వలపర్ల గ్రామంలో ఈ సంఘటన జరిగింది. వాస్తవంగా ఈ నెల 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీకి గతంలో రోజుకు రూ.272 ఇవ్వగా రూ.28 పెంచి రూ.300 ఇస్తున్నారు.
వలపర్లలో ఉపాధి కూలీలకు బంపర్ ఆఫర్
సిబ్బంది మాయాజాలం
మార్టూరు, ఏప్రిల్ 25 : వందరూపాయలు ఇవ్వండి.. మీఖాతాకు రూ.1700 పడేలా సెట్ చేస్తామంటూ కొందరు సిబ్బంది ఉపాధి కూలీల నుంచి డబ్బులు గుంజుతున్నారు. మండలంలోని వలపర్ల గ్రామంలో ఈ సంఘటన జరిగింది. వాస్తవంగా ఈ నెల 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీకి గతంలో రోజుకు రూ.272 ఇవ్వగా రూ.28 పెంచి రూ.300 ఇస్తున్నారు. వారం రోజులు ఎన్ఆర్జీఎ్సవై నిబంధనలు ప్రకారం కూలీలు పని చేస్తే రూ.1800 డబ్బులు కూలీల బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సి ఉంది. అయితే కూలీలు చేసిన పని ప్రకారం కొలతలను బట్టి వారికి వచ్చే వేతనాన్ని లెక్కిస్తారు. కొంతమంది కూలీలు వారంలో కొన్ని రోజులు పనికి రాకపోయినా.. పనులు తక్కువగా చేసినా వారికి తక్కువ మొత్తం డబ్బులు వారి ఖాతాలో జమ అవుతుంది. దీనిని ఆసరాగా చేసుకున్న సిబ్బంది కూలీలను మాయ చేస్తున్నారు. రూ.100 చొప్పున ఇస్తే మీ ఖాతాలో రూ.1700 జమ అయ్యేలా చూస్తామని చెప్పడంతో చాలా మంది కూలీలు వందేకదా అంటూ సిబ్బందికి డబ్బులు ఇస్తున్నట్లు తెలిసింది. వారిలో పురుషులు, మహిళా కూలీలు కూడా ఉన్నారు. వంద రూపాయలు పోతే పోయాయి తమ ఖాతాలో రూ.1700 జమ చేస్తే అంతే సంతోషమంటూ కూలీలు ఆశ గా ఎదురు చూస్తున్నారు. ఇదిలావుండగా ఇటీవల ఈ గ్రామంలోని ఫీల్డు అసిస్టెంట్ వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా కోడ్ ఉల్లంఘించినందులకు అతడిని విధుల నుంచి తొలగించారు. తాజాగా కూలీల నుంచి డబ్బులు వసూలు చేయడంపై ఉన్నతాధికారులు ఏమేరకు స్పందిస్తారో చూడాలి.