పొగాకు కిలో రూ.284
ABN , Publish Date - Apr 25 , 2024 | 01:19 AM
పొగాకు మార్కెట్లో మేలు రకం గ్రేడ్ ధర మెరిసిపోతోంది. బుధవారం దక్షిణాదిలో గరిష్ఠ ధర కిలో రూ.284 పలికింది. నాలుగు రోజుల క్రితం అత్యధిక ధర కిలో రూ.250లోపు ఉండగా సోమవారం రూ.256, మంగళవారం రూ.279 లభించింది.
మరింత పెరిగిన గరిష్ఠ ధర
లోగ్రేడ్ రేట్లపై కొండపిలో నిరసన
ఒంగోలు (క్రైం), ఏప్రిల్ 24 : పొగాకు మార్కెట్లో మేలు రకం గ్రేడ్ ధర మెరిసిపోతోంది. బుధవారం దక్షిణాదిలో గరిష్ఠ ధర కిలో రూ.284 పలికింది. నాలుగు రోజుల క్రితం అత్యధిక ధర కిలో రూ.250లోపు ఉండగా సోమవారం రూ.256, మంగళవారం రూ.279 లభించింది. బుధవారం కిలోకు మరో ఐదు రూపాయలు పెరిగి రూ.284కు చేరింది. ఒంగోలు-1 కేంద్రంలో ఈ ధర దక్కింది. మిగతా అన్ని కేంద్రాల్లోనూ గరిష్ఠ ధర రూ.280పైనే ఉంది. అలాగే లోగ్రేడ్లలో నాణ్యత కలిగిన బ్రౌన్ రకం ధర కూడా బుధవారం అధికంగానే ఉంది. ఇంచుమించు అన్ని కేంద్రాల్లోనూ ఈ రకానికి కిలోకు రూ.250పైన లభించింది. అయితే లోగ్రేడ్లోని పచ్చ, ఇతర తక్కువ రకం ధరలు వారం నుంచి తిరోగమనంలో ఉండగా బుధవారం కూడా అదేపరిస్థితి కొనసాగింది. పలు కేంద్రాల్లో నోబిడ్లు అధికంగా కనిపించాయి. దీనిపై కొండపి వేలం కేంద్రంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత సేపు కొనుగోళ్లను ఆపి నిరసన తెలిపారు. బోర్డు అధికారులు వారితో మాట్లాడి తిరిగి వేలాన్ని కొనసాగించారు.