ఒంగోలు అష్టదిగ్బంధం
ABN , Publish Date - Jun 02 , 2024 | 11:46 PM
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలోని ఒంగోలు పార్లమెంట్, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నగర సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 4న జరగనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేశారు. శివారుప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. 3వతేదీ రాత్రి నుంచి 4వతేదీ రాత్రి వరకూ భోజన హోటళ్లు, దుకాణాలు మూసివేయాలని, లాడ్జిలు, కల్యాణ మండపాల్లో కొత్త వ్యక్తులు ఎవ్వరూ ఉండకూడదని ఆదేశించారు.
శివారు ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు
24గంటలపాటు హోటళ్లు, దుకాణాలు మూసివేత
లాడ్జిలు, కల్యాణ మండపాల్లో
కొత్త వ్యక్తులు ఉండకూడదని ఆదేశాలు
ఒంగోలు (క్రైం), జూన్ 2 : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలోని ఒంగోలు పార్లమెంట్, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నగర సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 4న జరగనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేశారు. శివారుప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. 3వతేదీ రాత్రి నుంచి 4వతేదీ రాత్రి వరకూ భోజన హోటళ్లు, దుకాణాలు మూసివేయాలని, లాడ్జిలు, కల్యాణ మండపాల్లో కొత్త వ్యక్తులు ఎవ్వరూ ఉండకూడదని ఆదేశించారు. ఈమేరకు మైక్లు పెట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నగరమంతా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ ప్రజలు గుంపులుగా చేరినా వెంటనే కంట్రోలు రూమ్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నారు. నగరంలో కొత్త వ్యక్తుల కదలికలపై కూడా నిఘా ఉంచారు.
మూడు రోజులు మద్యం దుకాణాలు బంద్
జిల్లావ్యాప్తంగా ఈనెల 3,4,5 తేదీల్లో మద్యం అమ్మకాలు నిలిపివేస్తున్నారు. మద్యం దుకాణాలతోపాటు, బార్షాపులు మూతపడనున్నాయి. దీంతో ఆదివారం మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరారు. అదేసమయంలో బెల్ట్షాపులకు కూడా పెద్ద ఎత్తున మద్యాన్ని తరలించారు.