దర్శికి మహర్దశ..
ABN , Publish Date - Jun 23 , 2024 | 11:22 PM
: దర్శి ప్రాంత ప్రజల కలలు నెరవేరుతున్నాయి. టీడీపీ అధికారంలోకి రాగానే హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా జాతీయస్థాయి డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రం నిర్మాణానికి రూ.18.51 కోట్లు నిధులు విడుదల చేసింది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి ఆదివారం బాధ్యతలు చేపట్టాక నిధులు విడుదల చేస్తూ తొలిసంతకం చేశారు. అనంతరం ఆయన సీఎం చంద్రబాబుకు ఈ విషయాన్ని వివరించారు.
జాతీయస్థాయి డ్రైవింగ్ శిక్షణ కేంద్రానికి రూ.18.51 కోట్లు
నిధులు విడుదల చేస్తూ రవాణా శాఖమంత్రి రాంప్రసాద్రెడ్డి తొలిసంతకం
నెరవేరనున్న దర్శి ప్రజల కల
దర్శి, జూన్ 23 : దర్శి ప్రాంత ప్రజల కలలు నెరవేరుతున్నాయి. టీడీపీ అధికారంలోకి రాగానే హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా జాతీయస్థాయి డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రం నిర్మాణానికి రూ.18.51 కోట్లు నిధులు విడుదల చేసింది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి ఆదివారం బాధ్యతలు చేపట్టాక నిధులు విడుదల చేస్తూ తొలిసంతకం చేశారు. అనంతరం ఆయన సీఎం చంద్రబాబుకు ఈ విషయాన్ని వివరించారు.
పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం
గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో జాతీయస్థాయి డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రం పనులు ప్రారంభమయ్యాయి. వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా దీనిపై నిర్లక్ష్య వైఖరి అవలంబించింది. టీడీపీ హయాంలో ఆరంభించారనే అక్కసుతోనే వైసీపీ పాలకులు చాలారోజులు పట్టించుకోలేదు. మధ్యలో కొంతమేర కదలిక వచ్చినప్పటికీ పనులు ప్రారంభించిన పాపానపోలేదు. స్థానిక వైసీపీ నాయకులు కమీషన్లకు కకుర్తిపడి కాంట్రాక్టర్లను బెదిరించటంతో వారు చేతులెత్తేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పాతటెండర్లు రద్దు చేసి పలుసార్లు రీటెండర్లు పిలిచింది. వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనను గుర్తించిన కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రాలేదు. ఒక్కరు కూడా టెండరు కోడ్ చేయలేదు. ఇక డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రం అటకెక్కినట్లేనని ప్రజలు ఆశలు వదులుకున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో ప్రజలు ఊహించిన విధంగానే దర్శి నియోజకవర్గంలో ఎంతో ప్రాధాన్యత కల్గిన జాతీయ స్థాయి డ్రైవింగ్ శిక్షణ, పరిశోధన కేంద్రానికి నిధులు విడుదల చేశారు. ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు, టీడీపీ కూటమి తరుపున పోటీచేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డ్రైవింగ్ శిక్షణ కేంద్రం నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని స్పష్టమైన హమీ ఇచ్చారు. అందులోభాగంగా సీఎం చంద్రబాబు చొరవతో నిధులు వెంటనే విడుదలయ్యాయి.