మద్దిశెట్టి దారెటు?
ABN , Publish Date - Jan 17 , 2024 | 12:39 AM
సిటింగ్ సీటు లేదనడం, మరో సీటు అడిగితే సాను కూలంగా స్పందించకపోవటం, చివరికి కొత్త ఇన్చార్జికి సహకరించాలన్న విజ్ఞప్తీ లేకపోవటం.. వెరసి తీవ్ర అసంతృప్తితో ఉన్న దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఎలా ముందుకుపోవాలన్న అంశంపై దృష్టిసారించారు.
ప్రత్యామ్నాయ అవకాశాలపై అన్వేషణ
అనుచరులతో స్వగ్రామంలో సమావేశం
సోదరులిక్కడ, తాడేపల్లిలో వేణుగోపాల్
ఎంపీ లేదు.. ఒంగోలు ఎమ్మెల్యే అయితే పరిశీలిస్తాం
మూడురోజుల్లో నిర్ణయం అంటూ అనుచరులకు సంకేతం
నేడు బూచేపల్లి సమావేశంతో వేడెక్కిన దర్శి రాజకీయం
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
సిటింగ్ సీటు లేదనడం, మరో సీటు అడిగితే సాను కూలంగా స్పందించకపోవటం, చివరికి కొత్త ఇన్చార్జికి సహకరించాలన్న విజ్ఞప్తీ లేకపోవటం.. వెరసి తీవ్ర అసంతృప్తితో ఉన్న దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఎలా ముందుకుపోవాలన్న అంశంపై దృష్టిసారించారు. అటు ప్రత్యామ్నాయంగా వేరే అవకాశం ఇవ్వమని అధి ష్ఠానాన్ని కోరుతూనే, ఇటు నియోజకవర్గంలో అనుచ రులు చేజారిపోకుండా చూసుకునే ప్రయత్నం ప్రారంభించారు. మరోవైపు వైపాలెంలో ప్రస్తుత ఇన్చార్జి తాటిపర్తి చంద్రశేఖర్ ఫొటోల వరకు ఫ్లెక్సీలలో కనిపించకుండా చించివేయడం వైసీపీలో సరికొత్త వివాదానికి దారితీసింది.
స్వగ్రామంలో అనుచరులతో సమావేశం
తన స్వగ్రామమైన పామూరు మండలం లక్ష్మీనరసా పురంలో మద్దిశెట్టి దర్శి నియోజకవర్గంలోని అనుచరు లతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. అయితే చివరిక్షణంలో ఆయన కాకుండా సోదరుడు శ్రీధర్, మరో సోదరుడు హాజరయ్యారు. ఎంపీ విజయసాయిరెడ్డి నుంచి వచ్చిన పిలుపుతో ఎమ్మె ల్యే వేణుగోపాల్ తాడేప ల్లి వెళ్లారని సమావేశా నికి వచ్చిన అనుచరులతో శ్రీధర్ తెలిపారు. ముండ్ల మూరు, తాళ్లూరు ఎంపీపీలతోపాటు కురిచేడులో అనధికారికంగా ఎంపీపీ పాత్ర పోషిస్తున్న నాయకుడు, దర్శి ఏఎంసీ చైర్మన్, మాజీ చైర్మన్లతోపాటు ఆయా మండలాల పార్టీ కన్వీనర్లు, వైస్ ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు సర్పంచ్లు హాజరైన వారిలో ఉన్నారు. ‘మన కు దర్శిలో తిరిగి టికెట్ ఇవ్వలేదు. ఇక్కడ చూస్తే శివప్ర సాద్రెడ్డి నుంచి కనీస పలకరింపు కూడా లేదు. అందు కే మనందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం. వేచి ఉండండి’ అని శ్రీధర్ ఆ సమావేశానికి వెళ్లిన నాయకు లతో స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. ఎమ్మెల్యే వేణుగో పాల్ రాజకీయంగా ఎలాంటి ముందడుగు వేసినా మీరందరూ సహకరించాలి అంటూ దర్శి నియోజకవ ర్గాన్ని వదిలే ప్రసక్తేలేదని తేల్చిచెప్పినట్లు కూడా తెలుస్తోంది. గురు, శుక్రవారాల్లోనే ఎమ్మెల్యే నియోజకవర్గానికి వచ్చి అందరినీ కలుస్తారని వారు చెప్పినట్లు తెలిసింది.
నేడు బూచేపల్లి సమావేశం
దర్శిలో బుధవారం బూచేపల్లి పార్టీ సమావేశం ఏర్పాటుచేసి మద్దిశెట్టి అనుచరులను కూడా పిలిచారు. మంగళవారం సమావేశానికి వెళ్లిన వారికి కూడా ఈ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానాలు వెళ్లాయి. విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు నియోజకవర్గం నుంచి ప్రజలను తీసుకెళ్లే పేరుతో బూచేపల్లి ఈ సమావేశం ఏర్పాటుచేశారు. మద్దిశెట్టి ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లినవారిలో అత్యధికులు బూచేపల్లి ఏర్పాటుచేస్తున్న సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.
వైపాలెంలో ఫ్లెక్సీల రగడ
ఎర్రగొండపాలెంలో వైసీపీ నూతన ఇన్చార్జి తాటిపర్తి చంద్రశేఖర్ ఫొటోలను ఫ్లెక్సీలలో చించివేయడంతో ఆ నియోజకవర్గంలోని అధికార పార్టీలో అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఆయన.. మంత్రి సురేష్ లేకుండానే నియోజకవర్గంలోకి వెళ్లి పార్టీ నాయకుల పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వైపాలెంలో ఒకరోజు మకాంవేసి నాయకులను కలిశారు. ఆ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికే ఫ్లెక్సీలను వైపాలెంలో ఏర్పాటు చేశారు. అందులో మంత్రి సురేష్ కార్యాలయానికి వెళ్లేమార్గంలో ఉన్న ఐదింటిని గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. అదీ సీసీ కెమెరాలు లేని ప్రాంతాల్లోని ఫ్లెక్సీలలో ఇతర నాయకుల ఫొటోలకు ఇబ్బందిలేకుండా కేవలం చంద్రశేఖర్వి మాత్రమే కట్ చేశారు. దీంతో ఆ నియోజకవర్గ వైసీపీలో అంతర్గతంగా నెలకొన్న పోరు బయటపడింది. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో కొత్త మలుపు తిరిగే అవకాశం కూడా లేకపోలేదు.