మద్యం దొంగలు దొరికారు!
ABN , Publish Date - Mar 28 , 2024 | 02:12 AM
ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి బెల్టుషాపునకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు.
ప్రభుత్వ వైన్షాపు నుంచే బెల్ట్ దుకాణానికి సరఫరా
288 క్వార్టర్ బాటిళ్లను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు
సిబ్బందిపై కేసులు
కంభం, మార్చి 27 : ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి బెల్టుషాపునకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. రూ.45వేల విలువైన సరుకును, ప్రభుత్వ దుకాణంలో పనిచేసే ఇద్దరు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలను ఎస్ఈబీ డీఎస్పీ దుర్గాప్రసాద్ విలేకరులకు బుధవారం వివరించారు. ఆయన కథనం మేరకు.. అర్ధవీడు మండలం కాకర్ల గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్వైజర్గా పనిచేసే కొప్పుల వెంకట రమేష్, వాచ్మన్గా పనిచేస్తున్న దార్ల అనిల్, యాచవరంలో బెల్టుషాపు నిర్వహిస్తున్న యామా చిన్నవెంకటేశ్వర్లు కలిసి బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో సుమారు రూ.48వేల విలువైన 288 క్వార్టర్ బాటిళ్లను కారులో యాచవరం బెల్టుషాపునకు తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న కంభం ఎస్ఈబీ సీఐ బాలకృష్ణ, ఎస్సై సత్యనారాయణరావు పోతురాజుటూరు గ్రామసమీపంలో మాటువేశారు. అటువైపు వస్తున్న కారును నిలిపి తనిఖీ చేయగా మద్యం బాటిళ్లు దొరికాయి. కారుతోపాటు రమేష్, అనిల్ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం సీసాలు, కారు, నిందితులను గిద్దలూరులో కోర్టు హాజరుపరిచినట్లు డీఎస్పీ చెప్పారు.