లారీ లూటీ
ABN , Publish Date - May 23 , 2024 | 11:12 PM
హైవే వెంబడి దోపిడీలు సాధారణంగా జరుగుతుంటాయి. అయితే గురువారం దోర్నాలలో వెలుగుచూసిన లూటీ మాత్రం ఒకింత భిన్నమైనదే..
![లారీ లూటీ](https://media.andhrajyothy.com/media/2024/20240511/23dnl_2_e7f32799bd.gif)
వాహనాన్ని ఎత్తుకెళ్లి సామగ్రి అపహరణ
రాళ్లపై బాడీని నిలిపిన వైనం
యజమానికి రూ.3 లక్షలు నష్టం
పెద్దదోర్నాల, మే 23: హైవే వెంబడి దోపిడీలు సాధారణంగా జరుగుతుంటాయి. అయితే గురువారం దోర్నాలలో వెలుగుచూసిన లూటీ మాత్రం ఒకింత భిన్నమైనదే..!. గ్రామానికి చెందిన పఠాన్ యాసిన్ఖాన్ లారీని స్థానికంగా ఓ పెట్రోలు బంకు వద్ద బుధవారం రాత్రి నిలిపి ఉంచారు గురువారం తెల్లవారుజామున వచ్చిచూడగా నిలిపిన చోట లారీ కనిపించలేదు. దీంతో ఆందోళన చెంది తన మనుషులతో పలుచోట్ల వెతికించారు. ఈ క్రమంలో పెద్దారవీడు మండలం గంగుపల్లెకు వెళ్లే రోడ్డులో నిర్మానుష్య ప్రాంతంలో లారీని గుర్తించారు. లారీ ఆకారమైతే ఉంది కానీ, స్పేర్స్ మొత్తం మాయమ్యాయి. 12 టైర్లు, డిస్కులు అపహరణకు గురయ్యాయి. కిందపడకుండా రాళ్లపై బాడీని నిలబెట్టారు. ఇక లారీలోని 200 లీటర్ల డీజిల్, టార్ఫాలిన్ పట్టాలు, తాళ్లు, కేబిన్లోని విలువైన వస్తువులు కూడా ఎత్తుకెళ్లారు. మొత్తం రూ.3లక్షల విలువైన వస్తువులు దోపిడీకి గురైనట్లు బాధితుడు దోర్నాల పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఎస్సై అంకమరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.