రేషన్ పంపిణీపై జేసీ దృష్టి
ABN , Publish Date - Feb 06 , 2024 | 01:59 AM
రేషన్ పంపిణీపై జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. అక్రమాలను అరికట్టేందుకు ఆయన శ్రీకారం చుట్టారు.
ఒంగోలులో వాహనాల వద్ద పరిశీలన
ఒంగోలు(కలెక్టరేట్), ఫిబ్రవరి 5 : రేషన్ పంపిణీపై జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. అక్రమాలను అరికట్టేందుకు ఆయన శ్రీకారం చుట్టారు. బాధ్యతలు చేపట్టిన రోజే పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి రేషన్ వాహనం వద్ద బియ్యం పంపిణీని పరిశీలించిన ఆయన, సోమవారం మధ్యాహ్నం ఎవరికి తెలియకుండా ఒంగోలు నగరంలో పర్యటించారు. ప్రకాశం కాలనీలో రేషన్ పంపిణీ చేస్తున్న వాహనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ వివరాలు, పంపిణీ విధానాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న కార్డుదారులతో నేరుగా మాట్లాడారు. పంపిణీ ఎలా ఉంది? సక్రమంగా సరుకులు అందుతున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఏ సమయంలోనైనా జేసీ తనిఖీ చేస్తారనే భయాన్ని ఎండీయూ ఆపరేటర్లలో కల్పించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ మాఫియా రెచ్చిపోతూ రాత్రికిరాత్రే లారీల్లో బియ్యాన్ని తరలిస్తోంది. ఈ నేపథ్యంలో మొబైల్ వాహనాల వద్దనే బియ్యాన్ని తనిఖీ చేసే విధానానికి జేసీ శ్రీకారం చుట్టడంతో అక్రమార్కుల్లో అలజడి మొదలైంది.