పోలీసుశాఖ ప్రతిష్ఠను పెంచుతా
ABN , Publish Date - Jul 14 , 2024 | 11:18 PM
పోలీసు అధికారులు, సిబ్బందితో సమన్వయంతో పనిచేసి శాఖ ప్రతిష్ఠను మరింత పెంచుతానని జిల్లాకు ఎస్పీగా నియమితులైన ఏఆర్ దామోదర్ తెలిపారు. ఆయన ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’తో ఫోన్లో మాట్లాడారు.
నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు
గంజాయి, మత్తుపదార్థాలపై ఉక్కుపాదం
17న బాధ్యతల స్వీకరణ : నూతన ఎస్పీ దామోదర్
ఒంగోలు (క్రైం), జూలై 14 : పోలీసు అధికారులు, సిబ్బందితో సమన్వయంతో పనిచేసి శాఖ ప్రతిష్ఠను మరింత పెంచుతానని జిల్లాకు ఎస్పీగా నియమితులైన ఏఆర్ దామోదర్ తెలిపారు. ఆయన ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’తో ఫోన్లో మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెడతానని చెప్పారు. గంజాయి, మత్తుపదార్థాల కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటానన్నారు. సరఫరాదారులు, విక్రేతలపై ఉక్కుపాదం మోపుతానన్నారు. సిబ్బంది సంక్షేమానికి కూడా ప్రాధాన్యం ఇస్తానన్నారు. జిల్లా ప్రజలతో మంచి సంబంధాలున్నాయన్న ఆయన.. తన తొలిపోస్టింగ్ ఒంగోలులోనే ప్రొబేషనరీ డీఎస్పీగా ఆరు నెలలు పనిచేశానని గుర్తు చేశారు. 2021 నుంచి ఇప్పటి వరకూ ఒంగోలు పోలీసు శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్గా విధులు నిర్వహిస్తున్నానని తెలిపారు. ఈనెల 17న ఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తానని దామోదర్ చెప్పారు.