ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాల అమలుకు మీనమేషాలు
ABN , Publish Date - Mar 12 , 2024 | 12:12 AM
తప్పుడు స్వీయ ఫాం-7లు అప్లోడ్ చేసిన వ్యక్తులను గుర్తించకుండా, ఏమి తెలియని ఓటర్లను ఆగమేఘాల మీద గంటల వ్యవధిలోనే హాజరు కావాలని బీఎల్వోలు చెప్పటం పట్ల పలువురు బాధితులు, టీడీపీ నేతలు సోమవారం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సునీల్కుమార్కు ఫిర్యాదు చేశారు.
![ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాల అమలుకు మీనమేషాలు](https://media.andhrajyothy.com/media/2024/20240306/4_21d2c0b6a9.gif)
- తప్పుచేసిన వాళ్లను గుర్తించకుండా, ఏమి తెలియని వారికి శిక్షా!
- నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు
అద్దంకి, మార్చి 11: తప్పుడు స్వీయ ఫాం-7లు అప్లోడ్ చేసిన వ్యక్తులను గుర్తించకుండా, ఏమి తెలియని ఓటర్లను ఆగమేఘాల మీద గంటల వ్యవధిలోనే హాజరు కావాలని బీఎల్వోలు చెప్పటం పట్ల పలువురు బాధితులు, టీడీపీ నేతలు సోమవారం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సునీల్కుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, పలువురు బాధిత ఓటర్లు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారితో మాట్లాడారు. గత నెలలో ఇతర జిల్లా ఓటర్లు అద్దంకి నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లుగా నమోదు కావటంపై అన్ని ఆధారాలతో స్థానికంగా ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. విచారణ జరిపి మూడు రోజులలో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల అధికారి గతనెల 29న ఉత్తర్వులు ఇచ్చినా ఇంతవరకు నివేదిక ఇవ్వకుండా కాలయాపన చేయటంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ సానుభూతిపరులుగా ఉన్న ఓటర్ల పేరుతో ఎవరో దరఖాస్తు చేసిన స్వీయ ఫాం-7ల విషయంలో మాత్రం ఆగమేఘాల మీద విచారణ చేపట్టం ఏమిటన్నారు. నిబంధనల మేరకు ముందస్తుగా నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, వాటన్నింటిని పక్కనపెట్టి సోమవారం ఉదయం ఫోన్ చేసి మఽధ్యాహ్నం ఒంటి గంటలోపు హాజరై సమాధానం ఇవ్వాలని బీఎల్వోలు ఫోన్ చేయటాన్ని నియోజకవర్గ ఎన్నికల అధికారి దృష్టికి తీసుకుపోయారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకు పోవటంతో పాటు కోర్టును కూడా ఆశ్రయిస్తామని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు.
బల్లికురవ మండలం అంబడిపూడి, గుంటుపల్లి, కొత్తపాలెం, అద్దంకి మండలం ధేనువకొండకు చెందిన పలువురు స్వీయ ఫాం-7 బాధితులు సోమవారం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. తమ ఓట్లు తొలగించమని తప్పుడు ఫిర్యాదులు చేసిన వ్యక్తులను గుర్తించి శిక్షించాలని కోరారు. టీడీపీ నేతలు నాగినేని రామకృష్ణ, మానం మురళీమోహన్దాస్, చిన్ని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తమకు తెలియకుండా తమ పేర్లతో తప్పుడు స్వీయ ఫాం- 7 దాఖలు చేసిన వ్యక్తులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి అర్జీలు ఇచ్చేందుకు పలువురు బాధితులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.