సమస్యల పరిష్కారం కోసమే గ్రామసభలు
ABN , Publish Date - Aug 24 , 2024 | 01:16 AM
ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం గ్రామసభలను నిర్వహిస్తుందని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ చెప్పారు. మండలంలోని కొత్తపల్లిలో శుక్రవారం జరిగిన గ్రామసభలో ఆమె పాల్గొన్నారు
దర్శి, ఆగస్టు 23 : ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం గ్రామసభలను నిర్వహిస్తుందని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ చెప్పారు. మండలంలోని కొత్తపల్లిలో శుక్రవారం జరిగిన గ్రామసభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం అవసరమైన పనులను నిర్వహించేందుకు అధికారులకు అర్జీలు అందించాలన్నారు. ఎంపీడీవో కుసుమకుమారీ, సీడీపీవో భారతి పాల్గొన్నారు. మండలంలో అన్నీ పంచాయితీల్లో అధికారులు గ్రామసభలు నిర్వహించి అర్జీలు స్వీకరించారు.
కాలువ పూడిక తీత పనులను ప్రారంభించిన లక్ష్మి
తాళ్లూరు, ఆగస్టు 23 : రైతుల పంట పొలాలకు దోర్నపువాగు నీరు అందించే రజానగరం పంట కాలువ పూడికతీత పనులను నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావులు ప్రారంభించారు. విఠలాపురం వెళ్లే మార్గంలోని దోర్నపువాగు నుంచి రజానగరం పొలాలకు నీరు అందించేందుకు పంటకాలువ ఏర్పాటు చేశారు. ఆపంట కాలువ పూడికతో నిండి, చిల్లచెట్లతో నిండిపోయింది. దోర్నపువాగు ప్రవహిస్తే రజానగరం గ్రామ పొలాలకు నీరు వెళ్లే పరిస్థితి లేదు. గ్రామ మాజీ సర్పంచ్ ఖాశీం సైద్ కూడా పంటకాలువ దుస్థితి గురించి గతంలో వివరించారు. ఎంపీపీ తాటికొండ మండల పరిషత్ నిధుల్లో లక్షరూపాయలు మంజూరు చేశారు. ఆనిధులతో రజానగరం పంట కాలువ పూడిక తీత పనులు చేపట్టారు. మండల టీడీపీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్రెడ్డి, నేతలు షేక్ కాశీంసైద్, మానం రమేష్ బాబు, శాగం కొండారెడ్డి పాల్గొన్నారు.