జీతాలకు జీపీఎఫ్ మెలిక
ABN , Publish Date - May 26 , 2024 | 11:19 PM
జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) మినహాయింపులు లేని రెగ్యులర్ ఉద్యోగుల జీతాల బిల్లులను ఈనెల నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రెగ్యులర్ ఉద్యోగులు తమ మూలవేతనంలో (బేసిక్ పే) కనీసం ఆరుశాతానికి తగ్గకుండా జీపీఎఫ్ ఖాతాలో జమ చేసేందుకు ప్రతినెలా జీతాల బిల్లుల్లో మినహాయించాలి
![జీతాలకు జీపీఎఫ్ మెలిక](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఆరు శాతం చెల్లించని వారికి నిలుపుదల
ఖజానా శాఖ రాష్ట్ర డైరెక్టర్ మోహన్రావు ఆదేశం
ఒంగోలు (విద్య), మే 26 : జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) మినహాయింపులు లేని రెగ్యులర్ ఉద్యోగుల జీతాల బిల్లులను ఈనెల నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రెగ్యులర్ ఉద్యోగులు తమ మూలవేతనంలో (బేసిక్ పే) కనీసం ఆరుశాతానికి తగ్గకుండా జీపీఎఫ్ ఖాతాలో జమ చేసేందుకు ప్రతినెలా జీతాల బిల్లుల్లో మినహాయించాలి. అయితే కొందరు ఉద్యోగులకు ఇప్పటి వరకూ అసలు జీపీఎఫ్ ఖాతాలు లేవు. దీంతో వారు జీతాల బిల్లు మినహాయింపుల్లో చూపడం లేదు. అదేవిధంగా కొందరు నామమాత్రంగా చూపుతున్నట్లు ఖజానా శాఖ రాష్ట్ర డైరెక్టర్ ఎన్.మోహన్రావు గుర్తించారు. నిబంధనల ప్రకారం రెగ్యులర్ ఉద్యోగులంతా కచ్ఛితంగా తమ బేసిక్ జీతంలో ఆరుశాతం జీపీఎ్ఫకు మినహాయించాల్సిందేనని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. క్లాస్-4 ఉద్యోగులు, జడ్పీ పీఎఫ్, మునిసిపల్ ఉద్యోగులు, పీటీడీ వారికి మినహాయింపు ఇచ్చారు. మిగిలిన వారిలో ఆరుశాతం జీపీఎఫ్ మినహాయింపులేని వారి జీతాల బిల్లులను నిలిపివేయాలని డీటీవో, ఏటీవో, ఎస్టీవోలను ఆయన ఆదేశించారు. వివరాలను ఈనెల 31 నాటికి తన కార్యాలయానికి నివేదించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.