దొనకొండపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Aug 08 , 2024 | 11:05 PM
దొనకొండలో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు. దొనకొండలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటైన చిన్నతరహా పరిశ్రమల పార్క్ను, బ్రిటీష్కాలంలో ఏర్పాటైన విమానాశ్రయాన్ని గురువారం ఆయన పరిశీలించారు.
- జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ
- పరిశ్రమల పార్క్, విమానాశ్రయం పరిశీలన
దొనకొండ, ఆగస్టు 8: దొనకొండలో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు. దొనకొండలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటైన చిన్నతరహా పరిశ్రమల పార్క్ను, బ్రిటీష్కాలంలో ఏర్పాటైన విమానాశ్రయాన్ని గురువారం ఆయన పరిశీలించారు. దొనకొండలో ఏపీఐఐసీకి ఎంత భూమి కేటాయించారు, చిన్నతరహా పరిశ్రమల పార్క్లో ఎన్ని ప్లాట్లు వేశారు, పరిశ్రమల ఏర్పాటుకు నీటి సౌకర్యం, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు ఉన్నాయా అని అధికారులను ప్రశ్నించారు. పది కిలోమీటర్ల దూరంలో సాగర్ కెనాల్ ఉందని కనిగిరి ఆర్డీవో జాన్ ఇర్విన్ తెలిపారు. అలాగే, 30 కిలోమీటర్ల దూరంలో వెలిగొండ ప్రాజెక్టు ఉందని మ్యాపు ద్వారా వివరించారు. ఆక్రమణలు ఉన్నాయని ఆర్డీవో తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు ఎంపిక చేసే భూముల్లో ఆక్రమణలు లేకుండా చర్యలు చేపట్టాలని జేసీ ఆదేశించారు. రైలు, రహదారి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బ్రిటీష్ కాలంలో ఏర్పాటైన విమానాశ్రయం భవనం, చుట్టూ ఉన్న భూమి హద్దులను పరిశీలించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విమానాశ్రయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జేసీ పేర్కొన్నారు. దొనకొండలోని విమానాశ్రయం ప్రభుత్వం దృష్టిలో ఉండటంతో పరిశీలించేందుకు వచ్చినట్టు చెప్పారు. విమానాశ్రయానికి 136 ఎకరాల భూమి ఉందని, అదనంగా 340 ఎకరాల భూమిని గుర్తించినట్టు ఆర్డీవో జాన్ఇర్విన్ తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ బి.రమాదేవి, వీఆర్వో తన్నీరు హరినారాయణ, సర్వేయర్లు మస్తాన్వలి, సీహెచ్ వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.