గిద్దలూరు వైసీపీలో మరో ట్విస్ట్
ABN , Publish Date - Jan 21 , 2024 | 10:56 PM
గిద్దలూరు అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థి ఎంపిక విషయంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. రెడ్డి సామాజికవర్గంలో దీటైన అభ్యర్థి కోసం ఆపార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి సమాలోచనలు చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు మళ్లీ రంగంలోకి వచ్చారు. గిద్దలూరు నుంచి తిరిగి తాను పోటీచేయనని గత నెలలో రాంబాబు ప్రకటించిన విషయం విదితమే. ఆతర్వాత సీఎంను కలిసినప్పుడు కూడా అదేమాట చెప్పి వచ్చారు. అనంతరం గిద్దలూరు నుంచి బాలినేనిని రంగంలోకి దించాలని అధిష్ఠానం ప్రయత్నించడం, ఆతర్వాత ఆనేక మలుపులు చోటుచేసుకున్న విషయమ విదితమే.
టికెట్ కోసం మళ్లీ రంగంలోకి రాంబాబు
పోటీపడ్డ రెడ్డి సామాజికవర్గం నాయకులు
హైదరాబాద్లో పంచాయితీ
అన్ని విషయాలు సీఎం దృష్టి : బాలినేని
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
గిద్దలూరు అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థి ఎంపిక విషయంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. రెడ్డి సామాజికవర్గంలో దీటైన అభ్యర్థి కోసం ఆపార్టీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి సమాలోచనలు చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు మళ్లీ రంగంలోకి వచ్చారు. గిద్దలూరు నుంచి తిరిగి తాను పోటీచేయనని గత నెలలో రాంబాబు ప్రకటించిన విషయం విదితమే. ఆతర్వాత సీఎంను కలిసినప్పుడు కూడా అదేమాట చెప్పి వచ్చారు. అనంతరం గిద్దలూరు నుంచి బాలినేనిని రంగంలోకి దించాలని అధిష్ఠానం ప్రయత్నించడం, ఆతర్వాత ఆనేక మలుపులు చోటుచేసుకున్న విషయమ విదితమే. ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి అవసరమైన నిధులను సీఎం సమకూర్చడంతో ఒంగోలు నుంచే పోటీకి బాలినేని సిద్ధమయ్యారు. దీంతో గిద్దలూరు నుంచి రెడ్డి సామాజికవర్గం వారికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో దీటైన అభ్యర్థికోసం అన్వేషణ ప్రారంభించారు. శనివారం సీఎంను బాలినేని కలిసినప్పుడు టికెట్ ఆశిస్తున్న వారిలో తగు ఆర్థికస్థోమత ఉన్న వారిని ఎంపికచేయాలని సూచించారు. దీంతో పలువురు ఆశావహులు ఆదివారం హైదరాబాద్ వెళ్లి బాలినేనిని కలిశారు.
రాంబాబుకే టికెట్ ఇవ్వాలని అనుచరుల విజ్ఞప్తి
నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే రాంబాబు అనుచరులు పెద్దసంఖ్యలో బాలినేని వద్దకు చేరారు. ఎమ్మెల్యే రాంబాబు పోటీకి సిద్ధంగా ఉన్నారని, తిరిగి ఆయనకే అవకాశం ఇవ్వాలని వారంతా బాలినేనిని కోరారు. పోటీచేయనని రాంబాబు ప్రకటించిన విషయాన్ని బాలినేని ప్రస్తావించగా మీరు (బాలినేని) గిద్దలూరు నుంచి పోటీచేస్తారన్న ఉద్దేశంతో రాంబాబు ఆ ప్రకటన చేశారని, ఇప్పుడు మీరు ఒంగోలు నుంచే బరిలోకి దిగేందుకు సిద్ధపడిన నేపథ్యంలో ఆయన పోటీకి రెడీ అయ్యారని చెప్పినట్లు తెలిసింది. ఆయనకే అవకాశం ఇవ్వాలని వారు కోరారు. అయితే ఆర్థికంగా ఇబ్బంది ఉందని రాంబాబు చెప్పారు కదా అని బాలినేని అనగా తామంతా సహకరిస్తామని వారు చెప్పినట్లు తెలిసింది.
రెడ్డి సామాజికవర్గం నేతల పట్టు
బాలినేని సూచనతో టికెట్ ఆశిస్తూ హైదరాబాద్ వెళ్లిన రెడ్డి సామాజికవర్గం నాయకులు మాలో ఒకరికే అవకాశం ఇవ్వాలని, మళ్లీ వెనుకడుగు వేయకూడదని పట్టుబట్టినట్లు సమాచారం. నియోజకవర్గానికి చెందిన నాయకుల్లో రమణారెడ్డి, ఐవీ రెడ్డి, చేగిరెడ్డి లింగారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి తదితరులతోపాటు మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్రెడ్డి కుమారుడు ప్రవీణ్కుమార్రెడ్డి కూడా బాలినేనిని కలిసి టికెట్ అడిగిన వారిలో ఉన్నారు. కొత్తగా రంగంలోకి వచ్చిన ప్రవీణ్కుమార్రెడ్డి తనకు సమీప బంధువైన అనంతపురం జిల్లాకు చెందిన ఒక వైసీపీ నాయకుడితో ముందుగానే సీఎంను కూడా కలిసి టికెట్ కోసం విజ్ఞప్తిచేసినట్లు సమాచారం. పోటీచేయనని ప్రకటించిన రాంబాబు తిరిగి తెరపైకి రావడం వెనుక ఏదో కుట్ర ఉందని టికెట్ ఆశిస్తున్న రెడ్డి సామాజికవర్గ నేతలంతా బాలినేని వద్ద అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిసింది. చివరగా బాలినేని మాట్లాడుతూ అన్ని విషయాలు సీఎంతో మాట్లాడతానని, ఆయన తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని సూచించినట్లు సమాచారం. అయితే తిరిగి రాంబాబు రంగంలోకి రావడం నియోజకవర్గ వైసీపీలోని ఆయన వ్యతిరేక, అనుకూల వర్గాల్లో తీవ్రచర్చనీయాంశమైంది. ఈనేపథ్యంలో సీఎం ఎవరివైపు మొగ్గుచూపుతారనేది తేలాల్సి ఉంది. అయితే అందరినీ పక్కనపెట్టి స్థానికేతర నాయకుడిని రంగంలోకి దింపే అవకాశం కూడా లేకపోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.