గంజాయి చాక్లెట్
ABN , Publish Date - Feb 14 , 2024 | 01:20 AM
గంజాయి ముఠాలు రూటు మార్చాయి. మత్తులో చిత్తవుతున్న యువతకు మరింత చేరువయ్యేందుకు కొత్త ఎత్తుగడ వేశాయి.
రూటుమార్చిన స్మగ్లర్లు
గెలాక్సీపురిలో గ్రానైట్ కార్మికులకు జోరుగా విక్రయాలు
కళాశాలలకు చేరువయ్యే అవకాశం
ఒడిశా, బిహార్ నుంచి దిగుమతి
అప్రమత్తమైన ఎస్ఈబీ
గంజాయి ముఠాలు రూటు మార్చాయి. మత్తులో చిత్తవుతున్న యువతకు మరింత చేరువయ్యేందుకు కొత్త ఎత్తుగడ వేశాయి. చాక్లెట్ రూపంలో కార్మికులు, విద్యార్థులు, యువతకు వల విసురుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, బాపట్ల జిల్లా పర్చూరులో ఈ వ్యవహారం బయటకు రాగా తాజాగా జిల్లాలో కూడా వెలుగుచూసింది. ఉత్తరాది ప్రాంత కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గంజాయి చాక్లెట్ల విక్రయాలు జోరందుకున్నాయి. ఉమాంగ్, చార్మినార్, శ్రీమహాకాల్ అనే పేర్లతో ఈ చాక్లెట్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిని బడ్డీకొట్లలో యఽథేచ్ఛగా విక్రయిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇవేకనుక విద్యార్థులకు చేరువైతే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉంది.
ఒంగోలు (క్రైం) ఫిబ్రవరి 13 : గంజాయి విక్రయ ముఠాలు రెచ్చిపోతున్నాయి. విద్యార్థులు, యువతే లక్ష్యంగా చేసుకుని వారికి అందుబాటులో సరుకు ఉండేలా ఎత్తులు వేస్తున్నాయి. ఎస్ఈబీ, పోలీసులకు అనుమానం రాకుండా రకరకాల మార్గాల్లో విక్రయాలు చేపడుతూ భారీగా దండుకుంటున్నాయి. కొందరైతే ఏకంగా బడ్డీకొట్లు, టీస్టాళ్లను అడ్డాగా చేసుకుంటున్నారు. తాజాగా చాక్లెట్ల రూపంలో అమ్మడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవల మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు గంజాయికి బానిసలైనట్లు బయటపడింది. ఆక్రమంలో దాడులకు పాల్పడిన ఘటనలూ చోటుచేసుకొని రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కళాశాలల విద్యార్థులు ఆ మత్తుకు బానిసలుగా మారుతున్నారని తెలిసి జిల్లా పోలీసు యంత్రాంగం అప్పట్లో గంజాయి విక్రయాల కట్టడిపై దృష్టి సారించింది. బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు పోలీసు, ఎస్ఈబీ అధికారులు సంయుక్తంగా అవగాహన కార్యక్రయాలు నిర్వహించారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. మూలాలు ఎక్కువగా కళాశాలల్లోనే ఉండటమే అందుకు కారణం. అదే విధంగా గంజాయి విక్రయదారులపై కేసులు నమోదు చేసి కట్టడి చేసే క్రమంలో గంజాయి చాక్లెట్లు విక్రయం బయటపడింది. చీమకుర్తి మండలం బూదవాడలోని యల్లయ్యనగర్లో బడ్డీకొట్లో వీటిని విక్రయిస్తున్నట్లు గుర్తించిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు మంగళవారం వలపన్ని పట్టుకున్నారు. గతంలో ఇదేవిధంగా పర్చూరులో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వారిని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. చాక్లెట్ల రూపంలో జిల్లాలోకి గంజాయి రావడం ప్రమాదకర పరిస్థితికి అద్దం పడుతుంది.
ఒడిశా, బిహార్ నుంచి దిగుమతి
గంజాయి చాక్లెట్లు బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్లలో తయారవుతు న్నట్లు ఎస్ఈబీ అధికారుల విచారణలో వెల్లడైంది. రెండు నెలల క్రితం పర్చూరులో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఒడిశా యువకుడిని అధికారులు పట్టుకున్నారు. తాజాగా చీమకుర్తి మండలం యల్లయ్యనగర్లో పట్టుబడ్డాయి. బిహార్కు చెందిన నరేష్ సహానీ 2013 నుంచి యల్లయనగర్లో నివాసముంటూ గ్రానైట్ పరిశ్రమలలో పనిచేస్తున్నాడు. అతను అక్కడే ఓ బడ్డీకొట్టు నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారం మేరకు కొట్టులో సుమారు 3.5 కిలోల గంజాయి చాక్లెట్లను ఎస్ఈబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఉమాంగ్, శ్రీమహాకాల్, చార్మినార్ బ్రాండ్లతో చాక్లెట్లు ఉన్నాయి. ఒక్కో చాక్లెట్ పది నుంచి ఇరవై రూపాయిల వరకు అమ్ముతున్నారు. మిహార్లోని సమస్తపూర్ నుంచి గంజాయి చాక్లెట్లు తెచ్చి విక్రయిస్తున్నారు.
ఆ చాక్లెట్లు చాలా ప్రమాదకరం
గంజాయి మిశ్రమంతో తయారు చేసే చాక్లెట్లు చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. వాటిని నమలడం వలన శరీరంలోని అనేక అవయవాలు త్వరగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఐదు గ్రాములు ఉన్న ఆ చాక్లెట్లో 15శాతం గంజాయి ఉన్నట్లు గుర్తించారు. గంజాయి కారకాలు నేరుగా అవయవాలపై ప్రభావం చూపుతాయి. ఎక్కువగా ఇలాంటివి తిన్నవారికి కేన్సర్ వచ్చే అవకాశం ఉంది. చాక్లెట్లు కొంతమంది నమిలి మింగుతారు. మరికొందరు ఎకువ సేపు బుగ్గన పెట్టుకొంటుంటారు. ఒక్క చాక్లెట్ రెండు గంటలపాటు మత్తుని ఇస్తుందని వినియోగించిన వారు చెబుతున్నారు. ఇవి విద్యార్థులకు చేరువైతే పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశం ఉంది.
నిఘా పెంచిన ఎస్ఈబీ
గంజాయి చాక్లెట్ల విక్రయాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు అప్రమత్తమ య్యారు. చీమకుర్తి మండలం బూదవాడ యల్లయ్య నగర్లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న నరేష్ సహానీపై కేసు నమోదు చేసిన అధికారులు జిల్లాలో ఇంకా ఎక్కడైనా విక్రయిస్తున్నారా? అన్న దానిపై దృష్టిసారిం చారు. బడ్డీకొట్లలో గంజాయి విక్రయాలు ఆందోళన కలింగించే అంఽశం కావడంతో పోలీసు యంత్రాంగం జిల్లా అంతటా అప్రమత్తమై నిఘా పెంచింది.