టీడీపీ శ్రేణుల జోలికి వెళ్లొద్దు!
ABN , Publish Date - May 07 , 2024 | 01:14 AM
ఒంగోలు జీజీహెచ్లో గతనెల 10న చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించి కేసులు నమోదైన టీడీపీ శ్రేణులకు ఊరట లభించింది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
పోలీసులకు హైకోర్టు ఆదేశం
జీజీహెచ్ ఘటనలో కేసులు నమోదైన వారికి ఊరట
ఒంగోలు (కార్పొరేషన్), మే6 : ఒంగోలు జీజీహెచ్లో గతనెల 10న చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించి కేసులు నమోదైన టీడీపీ శ్రేణులకు ఊరట లభించింది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఒంగోలు సమతానగర్లో టీడీపీ శ్రేణులపై వైసీపీ మూకలు దాడి చేయడం, అనంతరం జీజీహెచ్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం విదితమే. ఈనేపథ్యంలో జీజీహెచ్లో ఘర్షణకు సంబంధించి పోలీసులు 50 మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. అయితే అవి అక్రమమని, ఈనెల 13న జరిగే పోలింగ్లో తాము పాల్గొనకుండా ఉండేందుకు కుట్రపూరితంగా ఈ కేసులు నమోదు చేశారని టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ కేసులకు సంబంధించి టీడీపీ శ్రేణుల జోలికి వెళ్లవద్దని, ఎలాంటి అరెస్టులు చేయవద్దని పోలీసులను ఆదేశించింది.