దింపుడుకల్లం ఆశలు
ABN , Publish Date - Jun 12 , 2024 | 01:33 AM
కీలకమైన కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో పదవుల్లో ఉన్న వైసీపీ శ్రేణులను కాపాడుకు నేందుకు ఆ పార్టీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పోలోమని అధికార టీడీపీలో చేరేందుకు చైర్మన్లు, కార్పొరేటర్లు సిద్ధమవుతు న్న నేపథ్యంలో వైసీపీ నేతలు కొందరు దింపు డు కల్లం ఆశలతో ప్రయత్నాలు చేస్తుండటం విశేషం.
కేడర్ను కాపాడుకునే ప్రయత్నంలో వైసీపీ
ఒంగోలు మేయర్, కార్పొరేటర్లతో బాలినేని భేటీ
తొందరపడకండి.. రెండు రోజుల్లో ఒంగోలు వస్తా
ఇతర మునిసిపాలిటీల్లోనూ ఇదే తంతు
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
కీలకమైన కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో పదవుల్లో ఉన్న వైసీపీ శ్రేణులను కాపాడుకు నేందుకు ఆ పార్టీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పోలోమని అధికార టీడీపీలో చేరేందుకు చైర్మన్లు, కార్పొరేటర్లు సిద్ధమవుతు న్న నేపథ్యంలో వైసీపీ నేతలు కొందరు దింపు డు కల్లం ఆశలతో ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్తోపాటు మార్కాపురం, కందుకూరు, చీరాల మునిసిపాలిటీలు.. అద్దంకి, చీమకుర్తి, దర్శి, కనిగిరి, గిద్దలూరు నగరపంచాయతీల్లో పాలక మండళ్లు ఉన్నాయి. ఇందులో దర్శి మినహా అన్నీ వైసీపీ చేతిలో ఉన్నాయి. అయి తే అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రజలు టీడీపీ కూటమికి పట్టం కట్టారు. అసెంబ్లీ ఎన్నికలో అన్నిచోట్లా టీడీపీ అభ్యర్థులకే భారీ ఆధిక్యతలు లభించాయి. ఆ విషయాన్ని ముందుగా పసిగట్టిన కొందరు వైసీపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పోలింగ్కు ముందే టీడీపీలో చేరిపోయారు. ఫలితాల అనంతరం వైసీపీ మట్టికరవడంతో పార్టీ పిరాయించేందుకు మిగిలిన వారు సిద్ధమయ్యారు. జిల్లాలో దర్శి మినహా ఒంగోలు కార్పొరేషన్తోపాటు అన్ని మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్న ప్రాంతాల్లో ఎమ్మెల్యేలుగా టీడీపీ నాయకులే గెలుపొందారు. దీంతో తాజాగా ఎక్కడికక్కడ వైసీపీ చైర్మన్లు, కార్పొరేటర్లు ఎక్కువమంది టీడీపీ వైపు దృష్టి సారించారు. అందులో ప్రధానంగా ప్రతిష్టాత్మకమైన ఒంగోలు కార్పొరేషన్లోని వైసీపీ శ్రేణుల్లో కదలికలు రావడం విశేషం. దీంతో ఓటమి బాధలో ఉన్న వైసీపీ అభ్యర్థుల్లో కొందరు పార్టీ మారే ఉద్దేశంలో ఉన్న వారిని కాపాడుకునే ప్రయత్నం ప్రారంభించారు. కొందరు ఓటమి చెందిన వైసీపీ అభ్యర్థులు అయితే అడ్రస్ లేరు. మరికొందరు వేచి చూసే ధోరణిలో సైలెంట్గా ఉన్నారు. ఒకరిద్దరు మాత్రమే జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారు.
మేయర్, కార్పొరేటర్లతో బాలినేని భేటీ
ఒంగోలు మేయర్ సుజాత వైసీపీలో అత్యధికమంది కార్పొరేటర్లు సమావేశమై తాజా పరిస్థితిపై చర్చించుకోవడం, ఎమ్మెల్యే జనార్దన్ను కలిసేందుకు మేయర్ సమాచారం పంపటం తెలిసిందే. ఈ నేపఽథ్యంలో మంగళ వారం మధ్యాహ్నం హైదరాబాద్లో బాలినేని మేయర్, కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ప్రస్తుతం ఆ పార్టీలో మేయర్తో కలిపి 38 మంది కార్పొరేటర్లు ఉండగా సుమారు 27మంది భేటీకి హాజరైనట్లు తెలిసింది. అందరికన్నా ముందే హైదరాబాద్ చేరిన మేయర్ బాలినేనిని ప్రత్యేకంగా కలిసి మాట్లాడినట్లు కూడా సమాచారం. తిరిగి మంగళవారం మధ్యాహ్నం బాలినేని అందరితో సమావేశమైనప్పుడు చాలాసేపు నిశ్శబ్ధ వాతావరణం నెలకొన్నట్లు తెలిసింది. కొందరు టీడీపీలో చేరేందుకు సిద్ధమైన విషయాన్ని బాలినేని ప్రస్తావిస్తూ తొందరెందుకు వేచిచూడండి అన్నట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో ఒంగోలు వస్తా.. అక్కడే మాట్లాడుకుందామని చెప్పినట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే గడువు ప్రభుత్వం తగ్గిస్తుందా.. లేదా అనేది చూద్దాం. ప్రభుత్వం పోకడ ఎలా ఉందో గమనిద్దాం అని బాలినేని అన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా కార్పొరేషన్పై ప్రత్యేక దృష్టిపెట్టిన ఎమ్మెల్యే దామచర్ల కార్పొరేటర్లను పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్సిగ్నల్ ఇస్తే పలువురు గోడ దూకేందుకు సిద్ధంగానే ఉన్నట్లుగా సమాచారం.