కఠిన నిబంధనలతో ఇబ్బందులు
ABN , Publish Date - Apr 18 , 2024 | 11:48 PM
నామినేషన్ల సందర్భంగా కఠిన ఆంక్షలు విధించడంతో ప్రజలు గురువారం నానా ఇబ్బందులు పడ్డారు. తహసీల్దార్ కార్యాలయానికి వంద మీటర్లు వరకు బారికేడ్లు కట్టి వాహన రాకపోకలపై, నడిచివెళ్లే ప్రయాణికులపై సైతం ఆంక్షలు విధించారు.
కొండపి, ఏప్రిల్ 18 : నామినేషన్ల సందర్భంగా కఠిన ఆంక్షలు విధించడంతో ప్రజలు గురువారం నానా ఇబ్బందులు పడ్డారు. తహసీల్దార్ కార్యాలయానికి వంద మీటర్లు వరకు బారికేడ్లు కట్టి వాహన రాకపోకలపై, నడిచివెళ్లే ప్రయాణికులపై సైతం ఆంక్షలు విధించారు. వంద మీటర్లు లోపల దుకాణాలను పోలీసులు మూయించారు. ఉదయం పది గంటల వరకు ఆర్టీసీ డిపో వరకు టంగుటూరు రోడ్డులోని బస్సులను అనుమతించిన పోలీసులు పది గంటల తర్వాత నుంచి ఆంక్షలు విధించారు. అదేవిధంగా ఆటోలు, ఇతర వాహనాలు కూడా రాకుండా నిరోధించారు. టంగుటూరు రోడ్డులో కొండపి గ్రామం వెలుపలే బస్సులను, ఆటోలను ఆపివేయడంతో ప్రయాణికులు నడిచి వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. ఎండ తీవ్రతలో వృద్ధులు నడవలేక అవస్థలు పడ్డారు. కొంత మంది పొలాలకు అడ్డంగా నడుచుకుంటూ దగ్గరి దారులు ద్వారా నడిచివెళ్లారు. మీడియా కూడా తహసీల్దార్ కార్యాలయం వెలుపల వేచి ఉండగా, ఆర్వోతో మాట్లాడిన సింగరాయకొండ సీఐ రంగనాథ్ 100 మీటర్ల వెలుపల మీడియా వేచి ఉండాలని సూచించారు. ఈఆర్వో కూడా తాను డీఆర్వోతో మాట్లాడానని వంద మీటర్లు దూరంలో మీడియా పాయింట్ ఏర్పాటు చేశామని అక్కడే మీడియా సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. భద్రతను కొండపి సీఐ పాండురంగారావు, ఎస్సై కృష్ణబాజీబాబు, పొన్నలూరు ఎస్సై రాజే్షలు పర్యవేక్షించారు.