దద్దరిల్లిన దర్శి
ABN , Publish Date - Apr 04 , 2024 | 11:31 PM
దర్శి టీడీపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి నియోజకవర్గ ప్రజలు అపూర్వస్వాగతం పలికారు. తొలిసారిగా ఆమె గురువారం నియోజకవర్గంలోకి రావటంతో ఆరంభ గ్రామమైన శంకరాపురం నుంచి దర్శి వరకు టీడీపీ కూటమి శ్రేణులు అడుగడుగునా నీరాజనాలు పలికాయి. దర్శి జనసందోహంతో దద్దరిల్లింది. సభాప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయి ఎటుచూసినా జనంతో కళకళలాడింది.
టీడీపీ అభ్యర్థి లక్ష్మికి అపూర్వస్వాగతం
అరమరికలు లేకుండా కదిలొచ్చిన టీడీపీ కూటమి శ్రేణులు
బారులు తీరిన జనంతో ర్యాలీ
కిక్కిరిసిన సభాప్రాంగణం
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
దర్శి టీడీపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి నియోజకవర్గ ప్రజలు అపూర్వస్వాగతం పలికారు. తొలిసారిగా ఆమె గురువారం నియోజకవర్గంలోకి రావటంతో ఆరంభ గ్రామమైన శంకరాపురం నుంచి దర్శి వరకు టీడీపీ కూటమి శ్రేణులు అడుగడుగునా నీరాజనాలు పలికాయి. దర్శి జనసందోహంతో దద్దరిల్లింది. సభాప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయి ఎటుచూసినా జనంతో కళకళలాడింది. 27 కిలోమీటర్ల దూరానికి లక్ష్మి, ఇతర నాయకులతో నిండిన వాహనం ర్యాలీ నాలుగు గంటల పాటు సాగింది. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి కూటమి శ్రేణులు ఎలాంటి అరమరికలు లేకుండా స్వచ్ఛందంగా తరలివచ్చి జేజేలు పలికారు. వేలాది వాహనాల్లో ప్రజలు తరలిరావటంతో కూటమి నాయకుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. దారిపొడవునా ఆయా గ్రామాల వద్ద ప్రజలు ముఖ్యంగా మహిళలు రోడ్లపైకి వచ్చి స్వాగతం పలకటం, హారతులివ్వటం అధికంగా కనిపించింది. సభాప్రాంగణానికి 20వేల మందికి పైగా వచ్చినట్లు అంచనా.
అడుగడుగునా ఘనస్వాగతం
జిల్లాలో పేరొందిన దివంగత మాజీమంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు, మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కుమార్తె లక్ష్మిని దర్శి అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. నరసరావుపేటలో టీడీపీ కుటుంబానికి చెందిన డాక్టరు లలిత్సాగర్ సతీమణి అయిన లక్ష్మిని అధిష్ఠానం చివరిక్షణంలో రంగంలో దింపింది. దీంతో ఆమె గురువారం సాయంత్రం తొలిసారిగా నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. సింగరకొండ ఆంజనేయస్వామి గుడిలో పూజలు అనంతరం సాయంత్రం సాయంత్రం 4.40 సమయంలో నియోజకవర్గంలోని శంకరాపురం గ్రామానికి చేరారు. అప్పటికే అక్కడకు భారీగా చేరిన టీడీపీ శ్రేణులు స్వాగతం పలికాయి. టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి, ఇతర నాయకులు కూడా ఆమెతోపాటు వాహనం ఎక్కగా 4.50 సమయంలో ర్యాలీ ప్రారంభమైంది. పోలవరం, వేంపాడు మీదుగా ముండ్లమూరు చేరేసరికి అటు తాళ్లూరు, ఇటు ముండ్లమూరు మండలాల్లోని వివిధ గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో కార్యకర్తలు వచ్చి వారికి స్వాగతం పలికారు. ముండ్లమూరు సెంటర్ ర్యాలీతో కిక్కిరిసింది. ఆతర్వాత పసుపుగల్లు, ఉల్లగల్లు, రెడ్డినగర్, పులిపాడుల మీదుగా రాత్రి 8.20 సమయానికి దర్శిలోకి ర్యాలీ ప్రవేశించింది. దర్శితోపాటు దొనకొండ, కురిచేడు ప్రాంతాల ప్రజలు కూడా అక్కడకు చేరటంతో దర్శి జనంతో కిక్కిరిసిపోయింది.
ఇక్కడే ఉండి సేవ చేస్తా:లక్ష్మి
ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం 9 గంటలకే సభ ముగించాల్సి ఉండటంతో అక్కడి నుంచి వేగంగా సభాప్రాంగణానికి చేరారు. ప్రాంగణంలో వేలాదిగా వేచి ఉన్న ప్రజలు వీరి వాహనం అక్కడకు రాగానే పెద్దఎత్తున జేజేలు పలుకుతూ స్వాగతించారు. అందిన సమాచారం మేరకు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రధానంగా టీడీపీ, జనసేన శ్రేణులు తరలివచ్చారు. సొంత వాహనాల్లో తరలిరావటమే అత్యధికంగా కనిపించింది. మహిళలు పెద్దసంఖ్యలో రావటం విశేషంగా చెప్పుకోవచ్చు. సభలో లక్ష్మితోపాటు ఎంపీ అభ్యర్థి మాగుంట ప్రసంగించినప్పుడు ప్రజల నుంచి భారీస్పందన రావటం విశేషం. లక్ష్మి మాట్లాడుతూ నేను మీ ఇంటి ఆడపడుచును. ఆదరించండి ఇక్కడే ఉండి మీకోసం పనిచేస్తా.. మీకు అండగా ఉంటా.. తన వైద్యసేవలు కూడా దర్శి ప్రజలకే అంకితం చేస్తానని చెప్పటంతో సభికులు పెద్దఎత్తున కేరింతలు కొట్టారు. సభలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు అభ్యర్థి దామచర్ల జనార్దన్, జనసేన అధ్యక్షుడు రియాజ్, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, స్థానిక బీజేపీ నాయకులు, ఇతర ప్రముఖులు మాట్లాడారు.