Share News

పోలీసు స్పందనకు 95 ఫిర్యాదులు

ABN , Publish Date - Mar 04 , 2024 | 10:38 PM

నగరంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌ హాల్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘స్పందన’కు జిల్లా వ్యాప్తంగా 95 మంది ప్రజలు వచ్చి తమ సమస్యలపై ఎస్పీ డాక్టర్‌ కె తిరుమలేశ్వరరెడ్డికి ఫిర్యాదులు అందజేశారు.

పోలీసు స్పందనకు 95 ఫిర్యాదులు
6శ్రావణ్‌4: ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ

నెల్లూరు(క్రైం), మార్చి 4: నగరంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్‌ హాల్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘స్పందన’కు జిల్లా వ్యాప్తంగా 95 మంది ప్రజలు వచ్చి తమ సమస్యలపై ఎస్పీ డాక్టర్‌ కె తిరుమలేశ్వరరెడ్డికి ఫిర్యాదులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.లక్షలు కాజేసే మోసగాళ్లను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. సైబర్‌ నేరాలు, అదనపు కట్నం కోసం వేధింపులు, ఆస్తి కోసం పిల్లలు చిత్రహింసలు పెడుతున్నారంటూ వచ్చిన తదితర ఫిర్యాదులను ఎస్పీ పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. బుజబుజనెల్లూరుకు చెందిన శ్రీకాంత్‌ నెల్లూరు మాగుంట లేఅవుట్‌లో సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్‌ కంపెనీని ఏర్పాటు చేసి సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ.30వేల తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారని, అయితే కష్టపడి పనిచేసిన తర్వాత జీతాలు ఇవ్వలేదని హరిత, వసీమ్‌, ఫిరోజ్‌, శివరామకృష్ణలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మొదటి నెల జీతం అడిగితే ప్రాజెక్టు పూరయిన తర్వాత చెల్లిస్తామని చెప్పి ఆరు నెలలు తర్వాత ప్రాజెక్టు ఫెయిల్‌ అయ్యిందని సాకు చూపి రాత్రికి రాత్రి కంపెనీ ఎత్తేశారని బాధితులు వాపోయారు. జీతంతో పాటు సెక్యూరిటీ డిపాజిట్‌లు సైతం తిరిగి ఇవ్వలేదని, ఎంతో మందిని మోసం చేసిన శ్రీకాంత్‌, అతని టీమ్‌పై చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు కోరారు.

Updated Date - Mar 04 , 2024 | 10:38 PM