కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె
ABN , Publish Date - Jan 08 , 2024 | 11:14 PM
సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారం కొనసాగింది. వారు విధులను బహిష్కరించి స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి సీఐటీయు, ఏఐటీయుసీ ఆధ్వర్యంలో నిర
![కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె](https://media.andhrajyothy.com/media/2023/20231205/3a_sagarm_8_3f49651f4e.jpg)
ఆత్మకూరు, జనవరి 8: సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారం కొనసాగింది. వారు విధులను బహిష్కరించి స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి సీఐటీయు, ఏఐటీయుసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ, సీపీఎం, సీఐటీయు నాయకులు నిరసనలో పాల్గొని మద్దతు తెలియజేశారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన జగన్ గాలికొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు, పలువురు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తాం
28వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మెఆత్మకూరు, జనవరి 8: సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు చేపట్టిన సమ్మె 28వ రోజుకు చేరింది. సోమవారం వారు విధులను బహిష్కరించి ఆత్మకూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట ఏర్పాటుచేసిన ప్రత్యేక శిబిరంలో బైఠాయించి సమ్మెను కొనసాగించారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ కమిటీ ప్రధాన కార్యదర్శి పి రాధ, పలువురు సెక్టార్ లీడర్లు కె రమణమ్మ, కామేశ్వరి, జమీల, విజయలక్ష్మీ, రూతమ్మ, విజయలక్ష్మీ, శ్రీదేవి, ఏ మస్తానమ్మ, పలువురు అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.
బెదిరింపులకు భయపడం
అనంతసాగరం : అంగన్వాడీలపై ప్రభుత్వం చేస్తున్న బెదిరింపు ధోరణికి తగ్గమని సీఐటీయూ మండల అధ్యక్షుడు అన్వర్బాష తెలిపారు. సమ్మెలో భాగంగా సోమవారం సీడీపీవో కార్యాలయం ఎదుట బోగి మంటలో ఎస్మా చట్టం ప్రతులను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో జేవీవీ నాయకులు వేము పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
సీతారామపురం : స్థానిక ఎమ్మార్వో కార్యాలయ ప్రాంగణంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కోడె రమణయ్య, ఆదిలక్ష్మి, కుమారి, చంద్రమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
జీవో ప్రతులు దహనం
వరికుంటపాడు : శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ప్రభుత్వం జారీ చేసిన ఎస్మా జీవోలను సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు దహనం చేసి ఆందోళనను యధావిధిగా కొనసాగించారు. వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు షేక్. రజియా ఆధ్వర్యంలో స్ధానిక తహసీల్దారు కార్యాలయ ఆవరణలో చేపడుతున్న ఆందోళనలో భాగంగా జీవో ప్రతులను దహనం చేసి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. కాగా సీఐటీయూ నాయకులు మట్టె హరినారాయణ, రమణారెడ్డి సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.
ఎస్మా ప్రయోగించడం దారుణం
న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం అత్యంత దారుణమని జనసేన మండలపార్టీ అధ్యక్షుడు పఠాన్ రసూల్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉదయగిరి : ఉదయగిరి సీడీపీవో కార్యాలయం ఎదుట అంగన్వాడీలు సోమవారం ధర్నా చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంతవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కాకు వెంకటయ్య, ప్రమీలా తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీల సమ్మెకు ఎల్సీ మద్దతు
వింజమూరు : అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మెకు సోమవారం తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేసిన, ఏపీటీఎఫ్ ప్రతినిధి ఎల్సీ రమణారెడ్డి మద్దతు ప్రకటించారు. ఆయన వింజమూరు వచ్చిన సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల బీసీ సంఘ నాయకులు ఉన్నారు.